ఏపీలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కృష్ణలంక సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజును ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా ఈ కేసుపై సస్పెన్స్ కొనసాగుతుండగా, మంగళవారం సిట్ అధికారులు ఆయనను అధికారికంగా అరెస్ట్ చేసి విచారణకు తరలించినట్లు తెలుస్తోంది. సీఐ నాగరాజు అరెస్ట్ వార్త విజయవాడతో పాటు రాష్ట్ర పోలీస్ శాఖలో తీవ్ర కలకలం రేపుతోంది. గాదె సాయికృష్ణను కస్టడీలోకి తీసుకున్న తర్వాత అతను అదృశ్యం కావడం, ఈ వ్యవహారంలో పోలీసుల పాత్రపై తీవ్ర ఆరోపణలు రావడం తెలిసిందే.
Also Read : బ్రాండ్ ఏపీ ప్రమోషన్.. ఢిల్లీలో మంత్రి నారా లోకేష్
సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుతో ఇప్పటికే సీఐ నాగరాజుపై హత్య, అక్రమ నిర్బంధం వంటి తీవ్రమైన సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ఐజీ రవిప్రకాష్ నేతృత్వంలో ప్రత్యేక సిట్ బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తును వేగవంతం చేసింది. మంగళవారం ఉదయం విజయవాడలోని సీఐ నాగరాజు నివాసానికి చేరుకున్న సిట్ మరియు టాస్క్ఫోర్స్ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో సీఐ నాగరాజు మద్దతుదారులు, అనుచరులు పోలీసుల రాకను గమనించి అడ్డుకునే ప్రయత్నం చేయడంతో అక్కడ తీవ్ర ఉత్కంఠ, తోపులాట చోటుచేసుకుంది.
Also Read : ఉదయం యాసిడ్ రిఫ్లక్స్ వేధిస్తోందా..? పరిష్కారం ఇదే..!
రంగంలోకి దిగిన అదనపు బలగాలు పరిస్థితిని అదుపులోకి తెచ్చి, నాగరాజును కస్టడీలోకి తీసుకున్నారు. ప్రస్తుతం సిట్ అధికారులు సీఐ నాగరాజును రహస్య ప్రాంతంలో ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. సాయికృష్ణ అదృశ్యం వెనుక అసలు ఏం జరిగింది? లాకప్ డెత్ జరిగిందా? కీలకమైన సీసీటీవీ ఫుటేజీలు ఎలా మాయమయ్యాయి? అనే కోణంలో అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ విచారణ అనంతరం సాయికృష్ణ మిస్టరీ కేసు పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

