స్టాండప్ కామెడీ.. ఇటీవల నవీన్ పోలిశెట్టి, అనూష్క జంటగా వచ్చిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా అందరికీ గుర్తే. ఆ సినిమాలో హీరో నవీన్ పోలిశెట్టి ఓ స్టాండప్ కమెడియన్. ఓ హాల్లో అప్పటికప్పుడు జోకులు వేస్తూ.. అక్కడ ఉన్న వారిని నవ్వించటమే స్టాండప్ కామెడీ. అయితే ఇటీవలి కాలంలో స్టాండప్ కామెడీ పేరుతో సమాజంలో కొందరు హద్దులు మీరి, ఇతరుల మనోభావాలను దెబ్బతీసే వెకిలి జోకులు, వ్యక్తిగత విమర్శలకు పాల్పడుతున్న ఘటనలు పెరిగాయి. వినోదం పేరుతో కొందరు వ్యక్తులపైన, ముఖ్యంగా ప్రముఖుల వ్యక్తిగత జీవితాలపై, కుళ్లు జోకులు వేయడం సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్ని రేపుతోంది.
Also Read : గుదిబండగా మారిన సలహాదారులు.. అవసరమా..!
నిజానికి స్టాండప్ కామెడీ అనేది ఒకరిని నవ్వించడానికి ఉద్దేశించిన కళ. అయితే ఆ నవ్వు ఎదుటివారి మనోభావాలు, వ్యక్తిగత జీవితాలను కించపరిచేలా ఉన్నప్పుడు అది పెద్ద వివాదానికి దారి తీస్తుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో స్టాండప్ కామెడీ పేరుతో కొంత మంది బాగా వైరల్ అవుతున్నారు. అలాంటి వారిలో అనుదీప్ కటికల అనే స్టాండప్ కమెడియన్ ఇటీవల తన షోలో చేసిన కామెంట్లు తీవ్ర విమర్శలకు గురయ్యాయి. చివరికి అనుదీప్పై పవన్ కల్యాణ్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. పలుచోట్ల కేసులు కూడా పెట్టారు. ఈ వివాదం ఇంకా ముగియక ముందే మరో స్టాండప్ కమెడియన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారం రేపుతున్నాయి.
Also Read : భాగ్యనగరం.. ఒక్క వర్షం.. ఎన్నో ప్రశ్నలు.. గుణపాఠాలేవి..?
స్టాండప్ కామెడీలో భావప్రకటనా స్వేచ్ఛ ముసుగులో అనుచిత వ్యాఖ్యలు చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నలుగురు నవ్వుతున్నారు కదా అని హాస్యం ముసుగులో సదరు మహిళ బూతులతో రెచ్చిపోయారు. కుటుంబ వ్యవస్థపైన నోటికి వచ్చినట్లు వ్యాఖ్యలు చేశారు. ఒకరిని ప్రేమిస్తే.. పెళ్లి అని.. కానీ.. నలుగురితో ఐ లవ్ యూ అని చెబితే మాత్రం.. నేను “లం..” అంటూ రాయలేని భాషలో నవ్వుతూ చెబుతున్నారు. “అలా పిలిపించుకునేందుకు నేను గర్వపడుతున్నా.. ఇదేదో బాగుంది కదా.. అందుకే మీరు కూడా నవ్వుతున్నారు కదా..” అంటూ దారుణంగా మాట్లాడారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
Also Read : వారణాసిలో 30 నిమిషాలు.. ఇండియానే షేక్ చేస్తాయట
ఇంత రోతగా మాట్లాడుతోంది .. ఎవరు ఈమె..? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. “స్వేచ్ఛ ఉండాలి కానీ మరీ ఇంత దారుణంగానా ? దానికి స్టాండప్ కామెడీ అని పేరు పెట్టారు.” అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఒకప్పుడు స్టాండప్ కామెడీ అంటే చాలా గౌరవం ఉండేది. కానీ, ఇప్పుడు దానంత లేకి షో ఇంకోటి లేదు.. అంటున్నారు. ఒకప్పుడు చక్కని హాస్యంతో నవ్వు తెప్పించారు. కానీ ఇప్పుడు మాత్రం కులం, మతం, బూతులు మాట్లాడుతూ నవ్విస్తున్నారు. కానీ ఈ మాటలతో చులకన అవుతున్నామనే విషయం మర్చిపోతున్నారు. హాస్యం అనేది నవ్వించేదిగా ఉండాలి కానీ, ఒకరిని కించపరిచేలా, బాడీ షేమింగ్ చేసేలా లేదా వ్యక్తిత్వ హననం చేసేలా ఉండకూడదని నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ దూకుడు సరైనదేనా? లేక దీనికి ఏదైనా నియంత్రణ ఉండాలా? అనే అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

