తెలుగుదేశం పార్టీ వార్షిక పండుగ మహానాడు వేడుకల్లో బుధవారం నాడు ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. సమాజంలో వెనుకబడిన, నిర్లక్ష్యానికి గురవుతున్న వర్గాలకు అండగా నిలిచే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. టీడీపీ చరిత్రలోనే తొలిసారిగా ఒక ట్రాన్స్ జెండర్ కు మహానాడు అధికారిక వేదికపై మాట్లాడే అరుదైన అవకాశాన్ని కల్పించింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గళ్లా మాధవి వ్యక్తిగత సహాయకురాలిగా పనిచేస్తున్న ట్రాన్స్ జెండర్ వర్షిణి ఈ ప్రతిష్టాత్మక వేదికపై నుండి ప్రసంగించారు.
Also Read : కోట్లకు కొన్నా.. జట్లకు తూట్లు పొడిచారు
మహానాడు ప్రతినిధుల సభలో భాగంగా వర్షిణి వేదికపైకి వచ్చి ప్రసంగిస్తున్నంత సేపు సభలో ఉన్న నాయకులు, కార్యకర్తలు చప్పట్లతో ఆమెను ప్రోత్సహించారు. తమ కమ్యూనిటీ ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తూనే, తమ లాంటి వారికి సమాజంలో గౌరవం, గుర్తింపు దక్కేలా తెలుగుదేశం పార్టీ, ఎమ్మెల్యే గళ్లా మాధవి కల్పించిన అవకాశాన్ని ఆమె కృతజ్ఞతతో గుర్తుచేసుకున్నారు. ఒక ట్రాన్స్ జెండర్ ను నమ్మి ప్రజాప్రతినిధికి పీఏ లాంటి కీలక బాధ్యతలు అప్పగించడమే కాకుండా, వేలాది మంది ప్రతినిధులు ఉన్న మహానాడు వేదికపై ప్రసంగించే అవకాశం ఇవ్వడం ద్వారా టీడీపీ సమానత్వానికి పెద్ద పీట వేసిందని రాజకీయ విశ్లేషకులు కొనియాడుతున్నారు.
Also Read : మన టార్గెట్.. జెన్ జీ, ఆల్ఫా జెన్.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..!
వర్షిణి ప్రసంగం ముగిసిన అనంతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. సమాజంలో ప్రతి ఒక్కరికీ ఆత్మగౌరవంతో జీవించే హక్కు ఉందని, తమ ప్రభుత్వం థర్డ్ జెండర్ సంక్షేమానికి కూడా పూర్తి ప్రాధాన్యత ఇస్తుందని ఈ సందర్భంగా పార్టీ వర్గాలు వెల్లడించాయి. మహానాడు వేదికగా జరిగిన ఈ పరిణామం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. పార్టీలకు అతీతంగా అందరూ టీడీపీ తీసుకున్న ఈ విప్లవాత్మక నిర్ణయాన్ని అభినందిస్తున్నారు.

