ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ప్రభుత్వ వ్యయాలను తగ్గించడం, ఇంధనాన్ని ఆదా చేయడం అనే లక్ష్యాలతో సరికొత్త పొదుపు మంత్రాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా తన భద్రతను పర్యవేక్షించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఉన్నతాధికారులకు ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. తన అధికారిక కాన్వాయ్ లోని వాహనాల సంఖ్యను ఏకంగా 50 శాతం మేర తగ్గించాలని స్పష్టం చేశారు. బ్లూ బుక్ భద్రతా నిబంధనలు, ఎస్పీజీ ప్రోటోకాల్స్ కు ఎలాంటి విఘాతం కలగకుండానే, కాన్వాయ్ లోని అదనపు వాహనాల సైజును తగ్గించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
Also Read : అమరావతి, పోలవరం ఆపాలా..? కేంద్రానికి నీతి ఆయోగ్ షాక్..!
గుజరాత్, అస్సాం పర్యటనల్లో ప్రధాని కాన్వాయ్ పరిమాణం మునుపటి కంటే చాలా చిన్నదిగా కనిపించడం విశేషం. ఈ పొదుపు చర్యల్లో భాగంగా పర్యావరణహిత విధానాలకు ప్రధాని మోదీ మరింత ప్రాధాన్యతనిస్తున్నారు. తన కాన్వాయ్లో వీలైనంత వరకు కాలుష్య రహిత ఎలక్ట్రిక్ వాహనాలను చేర్చాలని ఎస్పీజీని కోరారు. అయితే, దీనికోసం ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం పడకుండా, కొత్త వాహనాలను కొనుగోలు చేయకుండా కేవలం ప్రస్తుతం ఎస్పీజీ ఫ్లీట్ లో అందుబాటులో ఉన్న ఈవీలను మాత్రమే వినియోగించాలని స్పష్టమైన నిబంధన విధించారు.
Also Read : ప్రసంగించడానికి వెళ్లి పెట్టుబడులతో వచ్చిన బాబు
అదేవిధంగా, కాన్వాయ్ సైజు తగ్గడంతో పాటు ప్రధాని వెంట ప్రయాణించే ఎస్పీజీ కమాండోల సంఖ్యను కూడా తగిన రీతిలో సర్దుబాటు చేసి, కేవలం అవసరమైన ప్రధాన రక్షణ సిబ్బందిని మాత్రమే ఉంచాలని ఆదేశించారు. ఇటీవలే హైదరాబాద్లో జరిగిన సభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల దృష్ట్యా దేశప్రజలు ఇంధన వినియోగాన్ని తగ్గించుకోవాలని, ప్రజా రవాణా వ్యవస్థలను ఉపయోగించాలని పిలుపునిచ్చారు. అలాగే కనీసం ఏడాది పాటు అనవసరమైన బంగారం కొనుగోళ్లను వాయిదా వేసుకోవాలని, వీలైన చోట్ల ఐటీ రంగంలో వర్క్ ఫ్రమ్ హోమ్ సంస్కృతిని, వర్చువల్ సమావేశాలను తిరిగి ప్రోత్సహించాలని కోరారు.

