తెలంగాణ పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క షాక్ ఇచ్చారు. బిఆర్ఎస్ పార్టీకి, ఆ పార్టీ అధినేత, మాజీ సిఎం కేసీఆర్ కు లీగల్ నోటీసులు పంపారు. అంగన్వాడీ మొబైల్ ఫోన్ల కొనుగోలు విషయంలో తన ప్రతిష్టకు భంగం కలిగించేలా అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆమె నోటీసుల్లో మండిపడ్డారు. అంగన్వాడీ మొబైల్ ఫోన్ల కొనుగోలులో అవినీతి జరిగిందంటూ బిఆర్ఎస్ పార్టీ అధికారిక సోషల్ మీడియా వేదికల్లో చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని మంత్రి పేర్కొన్నారు.
Also Read : వైసీపీపై పయ్యావుల, నిమ్మల, అచ్చెన్నల త్రిశూల వ్యూహం..!
ఫోన్ల కొనుగోలు ప్రక్రియను తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ నిర్వహించిందని, టెండర్ ఇవాల్యుయేషన్ కమిటీ నిబంధనల ప్రకారమే కాంట్రాక్ట్ కేటాయింపు జరిగిందని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియతో తనకు వ్యక్తిగతంగా ఎటువంటి సంబంధం లేదని ఆమె తెలిపారు. మొత్తం టెండర్ విలువ కేవలం రూ. 44 కోట్లు మాత్రమే ఉన్నప్పుడు, అందులో రూ. 30 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించడం అత్యంత అసంబద్ధమని, ఇది కేవలం తనపై బురదజల్లే ప్రయత్నమేనని మంత్రి మండిపడ్డారు.
Also Read : ఏపీలో ఆన్లైన్ బెట్టింగ్ పై డీజీపీ సంచలన ఆదేశాలు..!
బిఆర్ఎస్ పార్టీ అధికారిక ఖాతాల నుండి జరుగుతున్న ఈ దుష్ప్రచారానికి పార్టీ అధినేతగా కేసీఆర్ బాధ్యత వహించాలని ఆమె డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో పెట్టిన తప్పుడు పోస్టులను వెంటనే తొలగించి, 48 గంటల్లోపు బహిరంగ క్షమాపణ చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. నిర్ణీత సమయంలోగా స్పందించకుంటే, కేసీఆర్పై సివిల్ మరియు క్రిమినల్ చర్యలు తీసుకుంటామని లీగల్ నోటీసులో హెచ్చరించారు. కుట్రపూరితంగా తన రాజకీయ ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తే సహించేది లేదని ఈ సందర్భంగా మంత్రి సీతక్క స్పష్టం చేశారు.

