వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు ఆ పార్టీ నేతలపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇటీవల హాట్ టాపిక్ గా మారిన మావిగన్ అంశంపై ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైసీపీ నేతలు ఇప్పుడు రాజధానిగా.. మావిగన్ కావాలి అంటూ చేస్తున్న విమర్శలపై షర్మిల ఘాటుగా స్పందించారు.గతంలో మూడు ముక్కలాట ఆడి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు.. ఇప్పుడు కొత్తగా మావిగన్ అంటూ ఓ ఆట ఆడుకున్నారు షర్మిల.
Also Read : శ్రీవారి వీఐపీ దర్శనం పేరుతో భారీ మోసం
అసలు ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నేతలు గాడిదలు కాశారా..? అప్పుడు మీకు ఈ మావిగన్ గుర్తుకు రాలేదా..? అంటూ ఎద్దేవా చేశారు. అప్పుడు ఎందుకు అభివృద్ధి చేయలేదని నిలదీశారు. అలాగే బొత్సాపై కూడా ఆమె విరుచుకుపడ్డారు. అసెంబ్లీలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డిని ఉద్దేశించి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై కూడా షర్మిల తీవ్రంగా స్పందించారు. సభలో వైఎస్ఆర్ ను బొత్స చులకన చేసి మాట్లాడారని.. ఆయన మాటలకు మా అమ్మ కంటతడి పెట్టుకున్నారని గుర్తు చేసారు.
Also Read : గర్భిణీ స్త్రీలు వాము తింటున్నారా..?
వైఎస్ఆర్ పెట్టిన భిక్షతో ఎదిగిన బొత్స.. ఈరోజు ఆయననే విమర్శించడం దుర్మార్గం. అసలు బొత్స ఎందుకు ఏడ్చారో ఆయనకే తెలియాలి అంటూ మండిపడ్డారు. అలాగే పులివెందుల పేరు మార్చి.. అవిగొడ్డలి అని పెట్టాలంటూ ఆమె చేసిన కామెంట్స్ కు కూడా సోషల్ మీడియాలో అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఏది ఎలా ఉన్నా.. మావిగన్ అంశంలో.. టీడీపీ నేతలు చేస్తున్న విమర్శల కంటే షర్మిల చేసిన వ్యాఖ్యలే ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాయనే భావన వ్యక్తమవుతోంది. సొంత అన్నను, మాజీ మంత్రులను ఆమె టార్గెట్ చేసిన తీరు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ముఖ్యంగా జగన్ విధానాలను ఎండగడుతూ ఆమె వేస్తున్న ప్రశ్నలు వైసీపీని ఆత్మరక్షణలో పడేస్తున్నాయి.

