భారత్ ఎన్ని రకాలుగా బుద్ధి చెప్తున్నా.. పాక్ వైఖరిలో మాత్రం మార్పు రావడం లేదు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ కు భారత్ పలురకాలుగా బుద్ధి చెప్పింది. అయినా సరే ఇప్పుడు మళ్ళీ సరిహద్దుల్లో కుట్రలకు పాక్ తెరలేపే ప్రయత్నం చేస్తోంది. అమెరికా నిఘా విభాగం తాజాగా విడుదల చేసిన వార్షిక ముప్పు అంచనా నివేదికలో భారత్-పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై సంచలన విషయాలను వెల్లడించింది. దక్షిణాసియాలో శాంతి భద్రతలకు సంబంధించి అమెరికా ఇంటెలిజెన్స్ విభాగం కీలక హెచ్చరికలు జారీ చేసింది.
Also Read : చిరంజీవి ‘భజన’పై తీవ్ర విమర్శలు..!
ముఖ్యంగా భారత్, పాకిస్థాన్ మధ్య సైనిక సంక్షోభం తలెత్తే అవకాశాలు మెండుగా ఉన్నాయని నివేదిక పేర్కొంది. పాకిస్థాన్ మద్దతు ఉన్న ఉగ్రవాద సంస్థలు భారత్ లో దాడులకు తెగబడే ప్రమాదం ఉందని అమెరికా హెచ్చరించింది. గతంలో మాదిరిగా కాకుండా, భారత్ ఇప్పుడు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదానికి దీటుగా సమాధానం ఇస్తోంది. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ మునుపటి కంటే కఠినంగా వ్యవహరిస్తోందని, ఒకవేళ పాక్ ఉగ్రవాదులు భారత్ పై దాడి చేస్తే, భారత్ సైనికపరంగా గట్టిగా బదులిచ్చే అవకాశం ఉందని, ఇది రెండు దేశాల మధ్య పెద్ద ఎత్తున సైనిక సంక్షోభానికి దారితీయవచ్చని నివేదిక విశ్లేషించింది.
ఆఫ్ఘనిస్తాన్ లో క్రియాశీలకంగా ఉన్న ఐసిస్-కె ఉగ్రవాద సంస్థ ఇప్పుడు దక్షిణాసియాపై కన్నేసిందని నివేదిక వెల్లడించింది. ఈ సంస్థ భారత్, పాకిస్థాన్లలో భారీ దాడులు చేసేందుకు ప్రణాళికలు రచిస్తోందని, తద్వారా ఈ ప్రాంతంలో అస్థిరతను సృష్టించాలని చూస్తోందని అమెరికా నిఘా వర్గాలు తెలిపాయి. ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ, పాకిస్థాన్ తన రక్షణ రంగంపై, ముఖ్యంగా క్షిపణి సాంకేతికత అభివృద్ధిపై భారీగా ఖర్చు చేస్తోంది. భారత్ ను ఎదుర్కొనేందుకు వీలుగా కొత్త తరం లాంగ్ రేంజ్ మిస్సైల్స్ ను తయారు చేసే పనిలో పాక్ నిమగ్నమైందని నివేదిక పేర్కొంది.
Also Read : అమెరికా మంత్రులను భయపెట్టిన డ్రోన్ లు..!
ఇది ప్రాంతీయ సమతుల్యతను దెబ్బతీసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. భారత్ సరిహద్దుల్లో చైనా చర్యలు, అలాగే పాకిస్థాన్ తో చైనాకు ఉన్న సాన్నిహిత్యం భారత్ కు రెట్టింపు సవాలుగా మారనున్నాయి. కాశ్మీర్ అంశంపై పాక్ తన పాత ధోరణిని వీడకపోవడం, సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నప్పటికీ లోలోపల కుట్రలు సాగించడం ఉద్రిక్తతలను పెంచుతున్నాయి. అమెరికా నిఘా విభాగం నివేదిక ప్రకారం, రాబోయే ఆరు నెలలు దక్షిణాసియాలో అత్యంత కీలకం కానుంది. ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో భారత్ అనుసరిస్తున్న ముందస్తు దాడుల విధానం వల్ల పాక్ ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.

