ఇండియన్ క్రికెట్ లోకి ఐపిఎల్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత, ఆటగాళ్ళ ప్రదర్శనకు ఐపిఎల్ ఒక ప్రామాణికంగా మారిపోయిన పరిస్థితి. ఈ నేపధ్యంలో కొందరు జాతీయ జట్టులో ఉన్న సీనియర్ ఆటగాళ్లకు కూడా ఇప్పుడు ఐపిఎల్ ప్రదర్శన కీలకమైపోయింది. ఈ క్రమంలోనే టీం ఇండియా వికెట్ కీపర్ రిషబ్ కెరీర్ కు రాబోయే ఐపిఎల్ సీజన్ అత్యంత కీలకంగా మారింది. 2025లో రికార్డు స్థాయిలో రూ. 27 కోట్లు పలికిన లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్, రిషబ్ పంత్ గత సీజన్ లో ఏ మాత్రం ఆకట్టుకోలేదు అనే విమర్శలు వచ్చాయి.
దీనితో 2026 సీజన్ ఒక అగ్నిపరీక్ష వంటిది. 2025 సీజన్ ఒక కొత్త ఆరంభం అయితే, 2026 సీజన్ పంత్ కెప్టెన్సీ వ్యూహాలకు అత్యంత కీలక సీజన్. ఢిల్లీ క్యాపిటల్స్లో ఉన్నప్పుడు రికీ పాంటింగ్ లాంటి దిగ్గజాల నీడలో ఉన్న పంత్, ఇప్పుడు లక్నోలో తన సొంత ముద్ర వేయాలి. జట్టును క్లిష్ట పరిస్థితుల్లో ఎలా నడిపిస్తాడు? ఒత్తిడిలో సరైన నిర్ణయాలు తీసుకోగలడా? అనే విషయాలపైనే అతని భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం భారత జట్టులో రోహిత్ శర్మ తర్వాత నాయకత్వ మార్పులు జరుగుతున్నాయి.
Also read : వన్డేలపై సూర్య కుమార్ సంచలన కామెంట్స్..!
2026లో హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, శుభ్మన్ గిల్ వంటి వారితో పంత్ పోటీ పడాల్సి ఉంటుంది. ఒకవేళ 2026 ఐపీఎల్లో లక్నోను ప్లే-ఆఫ్స్ లేదా ఫైనల్స్ కు చేర్చగలిగితే, టీమ్ ఇండియా తదుపరి కెప్టెన్గా పంత్ పేరు బలంగా వినిపిస్తుంది. ఇప్పటికే గిల్ నిరూపించుకోలేదు అనే విమర్శలు ఉన్నాయి. ఐపీఎల్లో అతను తన ఫామ్ను కొనసాగించడం చాలా ముఖ్యం. ప్రపంచ అత్యుత్తమ బౌలర్లను ఎదుర్కొంటూ తనేంటో మళ్లీ మళ్లీ నిరూపించుకోవాలి. ఏడాది గడిచినా, ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడు అనే ట్యాగ్ పంత్ వెంటే ఉంటుంది.
Also read : గిల్ కు అవార్డు.. రగిలిపోతున్న రోకో ఫ్యాన్స్..!
2025లో జట్టు ఆశించిన స్థాయిలో పంత్ రాణించలేదు. భారీ ధర తీసుకుంటున్నప్పుడు కేవలం వ్యక్తిగత స్కోర్లే కాదు, జట్టు విజయాలు కూడా ముఖ్యం. యజమాని సంజీవ్ గోయెంకా అంచనాలను అందుకోవడం పంత్ కు పెద్ద సవాల్ గా మారింది. ప్రమాదం తర్వాత పంత్ ఆటలో కొంత మార్పు వచ్చింది. కొంత దూకుడుగా ఆడే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సీజన్ లో గనుక అతను ఆడితేనే.. 2027 వరల్డ్ కప్ జట్టుకు సంబంధించి అతని పేరు వినపడుతుంది. టెస్ట్ లలో మాత్రమే పంత్ జట్టులో ఉంటున్నాడు. రాబోయే సీజన్ లో ఆడితే మాత్రం మూడు ఫార్మాట్ లలో పంత్ చోటు ఖరారు అయినట్లే.

