వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్పై తిరుగుబాటు జెండా ఎగరవేశారు త్రిదండి చినజీయర్ స్వామి. సీఎంగా ఉన్న నాడు జగన్పై ప్రశంసలు కురిపించిన చినజీయర్ స్వామి…ఇప్పుడు జగన్ నిర్ణయాలను తప్పుపడుతున్నారు. అమరావతిపై తాజాగా చినజీయర్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. అసలు చినజీయర్ స్వామి ఎందుకు మారారు..?
గతంలో చినజీయర్ స్వామి..జగన్కు అత్యంత సన్నిహితంగా ఉన్నారు. 2022లో ముచ్చింతల్ రామానుజ విగ్రహావిష్కరణ సమయంలో జగన్, చినజీయర్ స్వామికి మధ్య అనుబంధం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. జగన్కు అహంకారం లేదు, పెద్దల మాట వింటారంటూ చినజీయర్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. తర్వాత వైసీపీ ఎంపీలు, నేతలుసైతం స్వామీజీ చుట్టూ తిరిగేవారు.
Also Read : పవన్ మాట వినరేం..? ఇంకెన్నాళ్ళు ఈ జాగు..!
కానీ ఇప్పుడు చినజీయర్ యూటర్న్ తీసుకున్నారు. అమరావతి విషయంలో జగన్ నిర్ణయం తప్పని తేల్చేశారు. అమరావతి రైతుల పోరాటం, జగన్ ప్రభుత్వ నిర్బంధాలను తట్టుకుని అమరావతి రాజధానిగా నిలబడటానికి దైవబలమే కారణమన్నారు చినజీయర్. స్వామివారి దయతోనే అమరావతి రాజధానిగా ఏర్పడిందని, దానిని కాపాడటంలో హనుమంతుడి హస్తం ఉందని ఆయన చెప్పుకొచ్చారు. అమరావతి ప్రజలకు, రైతులకు ఆంజనేయుడి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు. కొందరు మధ్యలో ఇక్కడ నుంచి తొలగించాలని అనుకున్నా, తన రాజధాని నగరం అమరావతిలో ఉండాలని అనుకున్నట్లుగా.. కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చారంటూ జగన్కు పరోక్షంగా చురకలు అంటించారు.
చినజీయర్ స్వామి వ్యాఖ్యలతో వైసీపీ హైకమాండ్ ఇప్పుడు డైలమాలో పడింది. స్వామీజీని విమర్శిస్తే హిందూ ఓటు బ్యాంకుకు, భక్తులకు దూరం అవుతామనే భయం పట్టుకుంది. చినజీయర్ వ్యాఖ్యలపై సైలెంట్గా ఉంటే జగన్ నిజంగానే తప్పు చేశారనే భావన ప్రజల్లోకి వెళ్తుందని వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అప్పట్లో జగన్ చినజీయర్ కాళ్లకు నమస్కరించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఉన్నాయి. ఇప్పుడు ఆయనను తప్పు పడితే వైసీపీ నేతలకు ఇబ్బందిగా మారే అవకాశం ఉంది.

