వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు చెప్పగానే ముందుగా ఆ పార్టీ నేతలు గొప్పగా చెప్పే మాట ఒకటే. “మా అన్న మాట తప్పడు.. మడమ తిప్పడు..” అని. కానీ అసలు జగన్ వేరే ఉన్నాడనేది వాస్తవం. ఆయనను దగ్గరగా చూసిన వారికి మాత్రమే తెలుస్తుంది అసలు నిజం. జగన్ చెప్పేది ఒకటి.. చేసేది మరోటి అంటారు ఆయన సన్నిహితులు. అందుకే వైసీపీ నేతలు చాలా మంది జగన్ చెప్పే మాటలకు నవ్వుకుంటారు కూడా.
వైసీపీ అధికారంలోకి రావాలంటే ప్రజలకు మాయ మాటలు చెప్పాలనేది జగన్ సూత్రం అంటారు ఆయన సన్నిహితులు. అందుకే పాదయాత్ర సమయంలో ఇబ్బడిముబ్బడిగా హామీల వర్షం కురిపించారు. అందులో ప్రధానమైనవి అమ్మఒడి. ముందు ప్రతి విద్యార్థికి అని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తల్లికి మాత్రమే అన్నారు. వారంలో సీపీఎస్ రద్దు అన్నారు. కానీ ఆ విషయం అసాధ్యమన్నారు. టీటీడీలో పింక్ డైమండ్ మిస్సింగ్ అని హైకోర్టులో వేసిన పిటిషన్ను అధికారంలోకి వచ్చిన తర్వాత వెనక్కి తీసుకున్నారు. రాజధాని అమరావతి అని.. అందుకే రాజధాని పరిధిలోని తాడేపల్లిలో సొంత ఇల్లు కట్టుకున్నా అని గొప్పగా చెప్పారు. అదే సమయంలో చంద్రబాబుకు సొంత ఇల్లు కూడా లేదని 2019 ఎన్నికల ముందు ప్రచారం కూడా చేశారు. కానీ గెలిచిన తర్వాత 3 రాజధానులంటూ మాట మార్చేశారు వైఎస్ జగన్.
తాజాగా మరోసారి జగన్ డబుల్ స్టాండ్ డైలాగ్ బయటపెట్టారు. 2024 ఎన్నికల ప్రచార సమయంలో జగన్ ప్రతి పార్లమెంట్ పరిధిలో భారీ బహిరంగ సభలు నిర్వహించారు. ఆ సమయంలో పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేశారు. అలా పరిచయం చేసే క్రమంలో వారి గురించి గొప్పగా చెప్పాలని ప్రయత్నం చేశారు. తమ పార్టీ అభ్యర్థులంతా కేవలం ప్రజా సేవకులే అని.. వారి పరిస్థితి ఆర్థికంగా అంతంత మాత్రమే అని ప్రత్యేకంగా ప్రస్తావించారు. వారికి ఓటు వేసి గెలిపిస్తే.. డబ్బు సంపాదన కంటే.. ప్రజా సేవకే ఎక్కువ సమయం కేటాయిస్తారని ప్రకటించారు. ఈ డైలాగ్లు అప్పట్లోనే ప్రజల్లో నవ్వు తెప్పించాయి.
తాజాగా ప్రెస్మీట్ నిర్వహించిన జగన్ను ఓ మీడియా ప్రతినిధి ప్రత్యేకంగా ఓ అంశంపై ప్రస్తావించారు. వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రాకపోవడం గురించి అడిగారు. అలాగే స్పీకర్ అయ్యన్నపాత్రుడు చేసిన జీతాల ప్రస్తావన కూడా ప్రశ్నించారు. సభకు రాని వారికి జీతం ఎందుకు ఇవ్వాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు వేసిన ప్రశ్నకు జగన్ చెప్పిన సమాధానం ఇప్పుడు ఆయన ద్వంద్వ వైఖరిని బయటపెడుతోంది. అయినా జీతం కోసం మాత్రమే ఎదురు చూసే ఎమ్మెల్యేలు ఎవరున్నారు చెప్పు.. అంటూ ఎదురు ప్రశ్నించారు. అంటే తమ పార్టీకి చెందిన ప్రతి ఎమ్మెల్యే కూడా.. ఆర్థికంగా బాగా స్థితిమంతుడే అని.. వారెవరికి జీతాలు అవసరం లేదనేది జగన్ మాట. ఎన్నికల ప్రచార సమయంలో తనకు మీడియా లేదు, ఎలాంటి వ్యాపారాలు లేవు అని అబద్ధపు మాటలతో ప్రజలను నమ్మించాలని చూసి బొక్క బోర్లా పడ్డారు. ఇప్పుడు జీతాల విషయంలో తమ పార్టీ ఎమ్మెల్యేలకు జీతం అవసరం లేదని పరోక్షంగా చెప్పేశారు జగన్.

