వైసీపీ నేతలకు సడెన్గా సీబీఐ మీద ప్రేమ పుట్టుకొచ్చింది. జగన్ బాబాయ్ వివేకా హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారుల మీద.. వైసీపీ ప్రభుత్వం కేసులు పెట్టిన సంగతి గుర్తుంది కదా.. ఇదే కేసులో ఎంపీ అవినాశ్రెడ్డిని అరెస్టు చేయడానికి వచ్చిన సీబీఐ అధికారులను.. వైసీపీ కార్యకర్తలు అడ్డుకొన్న విషయం అందరికీ తెలిసిందే. అప్పడు ఇదే సీబీఐకి ఏపీ పోలీసులు సహాయ నిరాకరణ కూడా బహిరంగ రహస్యమే. అలాంటి వైసీపీ నాయకులు.. పవర్ పోయాక సీబీఐ పేరును కలవరిస్తున్నారు. పార్టీ బిగ్బాస్ జగన్మోహన్రెడ్డి దగ్గర మొదలుకొని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్రెడ్డి వరకు అందరూ సీబీఐ విచారణ కోసం డిమాండ్ చేస్తున్నారు.
Also Read : బ్రేకింగ్: వివేకా కేసులో జగన్ నిర్దోషి..?
ఒక్కసారి ఆరున్నరేళ్లు వెనక్కి వెళ్తే.. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న ఇదే వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. వాళ్లే అడుగుతున్నారు కదా అని అప్పటి సీఎం చంద్రబాబు.. వివేకా కేసును సీబీఐకి అప్పగించారు. ఇక్కడే కథ అడ్డం తిరిగింది. అనుకోని విధంగా వైసీపీ అధికారంలోకి వచ్చింది. వెంటనే సీబీఐ మీద ప్రేమ స్థానంలో కోపం పుట్టుకొచ్చింది. కేసును సీబీఐ నుంచి లాక్కొనే ప్రయత్నం చేశారు. కుదరకపోవడంతో.. ఆ సంస్థ అధికారుల మీదే రివర్స్ కేసులు పెట్టారు.
Also Read : జైలులో రవి.. ఆగని పైరసీ..!
కట్ చేస్తే.. మళ్లీ వైసీపీ ప్రతిపక్షంలోకి వచ్చింది. తిరుమల నెయ్యి కల్తీ స్కామ్ బయటపడింది. కేసును సీబీఐకి అప్పగించాలన్న వైసీపీ కోరికా నెరవేరింది. కానీ జగన్ హయాంలో నెయ్యి కల్తీ చేశారని సీబీఐ సిట్ తేల్చింది. పరకామణి చోరీలో కొత్త కోణాలు వెలుగు చూశాయి. అప్పుడూ ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. చివరికి విజయవాడలో ప్రభుత్వ భూములు అక్రమించి కట్టుకున్న ఇళ్లను కూల్చేసినా.. ఆ సంఘటనపై సీబీఐ విచారణ చేయించాలని కోరుతున్నారు వైసీపీ అధినేత జగన్రెడ్డి. ఇంకో కామెడీ ఏంటంటే.. కోర్టులోనే దొంగతనం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత కాకాణి గోవర్ధన్రెడ్డి.. తనపై ఉన్న 14 కేసులను సీబీఐతో విచారించాలని లేఖ రాశారు. అధికారంలో ఉండగా అస్సలు నచ్చని సీబీఐ మీద.. ప్రతిపక్షంలోకి రాగానే ఇంత ప్రేమ ఎలా పుట్టుకొచ్చిందీ అనేది చాలా మందికి అర్ధం కావడం లేదు. ఏపీ పోలీసులంటే భయమా.. లేక సీబీఐ విచారణలో తప్పించుకోవడం తేలికా.. ఈ విషయం వైసీపీ నేతలే క్లారిటీ ఇవ్వాలి.

