గత పదేళ్లుగా తెలంగాణ రాజకీయాలు నిత్యం ఆసక్తిని రేపుతున్నాయి. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో చేస్తున్న రాజకీయం ఎప్పుడూ ఇంట్రెస్టింగ్ గానే ఉంది. 2014 కంటే 2018లో కొంత బలపడిన పార్టీ.. 2024 పార్లమెంట్ ఎన్నికల నాటికి, 2023 అసెంబ్లీ ఎన్నికల నాటికి ఊహించని స్థాయిలో బలపడింది. హిందుత్వ ఓటు బ్యాంకును.. తమ వైపుకు తిప్పుకోవడంలో సక్సెస్ అయిన బీజేపీ నేతలు… 8 ఎమ్మెల్యేలను, ఏకంగా 8 ఎంపీ స్థానాలను గెలవడం ఓ సంచలమైంది. దీనితో తెలంగాణలో భారత రాష్ట్ర సమితికి గడ్డు రోజులు లేదంటే భవిష్యత్తు కష్టమే అనే కామెంట్స్ వినిపించాయి.
Also Read : మంత్రి లోకేష్కు ఆ విషయంలో ఇబ్బందులు..!
కానీ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ మాత్రం ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్లడం లేదు. ప్రభుత్వంపై విమర్శలు చేసే విషయంలో గానీ, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే విషయంలో గానీ, రెండవ ప్రత్యామ్నాయంగా ఎదిగే విషయంలో గానీ, దూకుడుగా ముందుకు వెళ్లలేకపోతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదేళ్లపాటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంటుందని ధీమాగా రాజకీయం చేస్తుంటే, మళ్లీ బలపడాలని గులాబీ పార్టీ కష్టపడుతుంటే.. తెలంగాణ బిజెపి నేతలు మాత్రం దూకుడుగా ముందుకు వెళ్లడం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎదుర్కొనే విషయంలో గులాబీ పార్టీకి అనేక సమస్యలు ఉన్నాయి. అంతర్గత కుమ్ములాటలు ఆ పార్టీని ఇబ్బంది పెడుతున్నాయి.
బిజెపిలో గతంలో అటువంటి పరిస్థితి ఉండేది కాదు. కానీ ఇప్పుడు మాత్రం అంతర్గత పోరు ఆ పార్టీని క్షేత్రస్థాయిలో ఇబ్బంది పెడుతోంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో అభ్యర్థి విషయంలో కూడా పార్టీలో ఏకాభిప్రాయం లేదనే కామెంట్స్ వినిపించాయి. ఆ ఎన్నికల్లో కనీసం బిజెపి ప్రభావం చూపించలేదు. ఇప్పటివరకు జరిగిన రెండు దశల పంచాయతీ ఎన్నికల్లో కూడా బిజెపి పెద్దగా ప్రభావం చూపించిన పరిస్థితి లేదు. పంచాయతీ ఎన్నికలపై రెండు పార్టీలు దూకుడుగా ముందుకు వెళితే.. బిజెపి మాత్రం కనీసం మండల స్థాయి నాయకత్వానికి దిశా నిర్దేశం చేయడంలో కూడా విఫలమైంది.
Also Read : ఈ ఎస్పీ పేరు చెప్తే గంజాయి బ్యాచ్ కు హడల్..!
2018 ఎన్నికల తర్వాత కాస్త దూకుడు పెంచిన తెలంగాణ బిజెపి కార్యకర్తలు.. ఇప్పుడు మాత్రం చప్పబడిపోయారు. మూడవ దశ పంచాయతీ ఎన్నికల్లో కూడా పార్టీ పెద్దగా ప్రభావం చూపించే పరిస్థితి కనపడటం లేదు. అది జాతీయ పార్టీ అయినా, ప్రాంతీయ పార్టీ అయినా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం చూపిస్తేనే.. భవిష్యత్తు ఉంటుంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు కనీసం తమ తమ నియోజకవర్గాల్లో పర్యటించి.. భవిష్యత్తులో రాబోయే ఇతర స్థానిక సంస్థల ఎన్నికల్లోనైనా పార్టీని బలోపేతం చేసే అంశంపై దృష్టి పెట్టాలి. కవిత దెబ్బకు గులాబీ పార్టీ ఇబ్బంది పడినప్పటికీ.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ తమ నియోజకవర్గాల్లో పార్టీని పంచాయతీ ఎన్నికల్లో ముందుకు నడిపించారు. తమకు బలంగా ఉన్న జిల్లాలతో పాటుగా ముఖ్యమంత్రి సొంత జిల్లాలో కూడా గులాబీ పార్టీ ఎంతో కొంత ప్రభావం చూపించింది. కానీ బిజెపి మాత్రం ఈ విషయంలో విఫలమవుతూనే ఉంది.

