భారత మహిళా క్రికెట్లో లేడీ విరాట్ కోహ్లీగా గుర్తింపు పొందిన స్టార్ బ్యాటర్ స్మృతి మందాన మరోసారి వార్తల్లో నిలిచింది. అన్ని ఫార్మాట్లలో సెంచరీలు నమోదు చేసిన అరుదైన ప్రతిభావంతురాలిగా స్మృతి పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగింది. ఇటీవల వన్డే వరల్డ్ కప్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఆమె, టీమిండియాకు విజయం అందించిన వారిలో ఒకరు.
ఈ విజయాల దూకుడులో వ్యక్తిగత జీవితంలో కూడా కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతుందనే వాతావరణం నెలకొంది. బాలీవుడ్ సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ తో స్మృతి కొంతకాలంగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. వన్డే వరల్డ్ కప్ గెలిచిన తర్వాత మైదానంలోనే ముచ్చల్ చేసిన వినూత్న ప్రపోజల్ వైరల్ అయ్యింది. అనంతరం ఇద్దరూ త్వరలోనే వివాహ బంధంతో ఒక్కటవుతున్నట్టు అధికారికంగా ప్రకటించారు కూడా. మహారాష్ట్రలోని సాంగ్లీ ప్రాంతంలో పెళ్లి ఏర్పాట్లు జోరుగా సాగాయి. ముందస్తు వేడుకలు కూడా ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో షెఫాలీ వర్మ, జేమీమా రోడ్రిగ్స్ లాంటి క్రికెటర్లు సందడి చేశారు.
Also Read : గంభీర్ పెత్తనం.. రంగంలోకి బోర్డు..!
అయితే పెళ్లి వేడుకల మధ్య అనూహ్య ఘటనలు చోటుచేసుకున్నాయి. స్మృతి తండ్రి శ్రీనివాస్ మందాన హఠాత్తుగా గుండెపోటుతో ఆసుపత్రి పాలవ్వడం, అదే సమయంలో పలాష్ ముచ్చల్ జ్వరం–గ్యాస్ట్రిక్ సమస్యలతో చికిత్స పొందడం ఆందోళన కలిగించింది. అంతేకాదు, ఎంగేజ్మెంట్కు సంబంధించిన ఫోటోలను స్మృతి సోషల్ మీడియా నుంచి తొలగించటం, ఆమె సహచరులు కూడా వీడియోలు డిలీట్ చేయడం కొత్త అనుమానాలకు తావిచ్చాయి. ఈ సమయంలో జట్టు సభ్యులు “స్మృతికి అండగా ఉంటాం” అంటూ సందేశాలు ఇవ్వడం పరిస్థితులను మరింత చర్చనీయాంశంగా మార్చింది.
Also Read : జగన్ మాస్టర్ ప్లాన్.. మామూలుగా లేదుగా..!
చివరికి, అభిమానులు ఊహించని విధంగా స్మృతి మందాన స్వయంగా సోషల్ మీడియాలో పెద్ద ప్రకటన చేసింది. ముచ్చల్తో తన వివాహాన్ని రద్దు చేసుకున్నట్టు అధికారికంగా వెల్లడించింది. “కొంతకాలంగా నా వ్యక్తిగత జీవితం గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. నా జీవితంలో చోటు చేసుకున్న ముఖ్యమైన విషయం — ముచ్చల్తో నా వివాహాన్ని రద్దు చేసుకున్నాను. ఇకపై పూర్తిగా క్రికెట్ పైనే, టీమిండియాకు మరిన్ని ట్రోఫీలు అందించడంపైనే దృష్టి పెడతాను. ఈ సమయంలో రెండు కుటుంబాల ప్రైవసీని గౌరవిస్తారని ఆశిస్తున్నాను” అని స్మృతి పేర్కొంది.

వన్డే వరల్డ్ కప్ విజయోత్సాహం మధ్య ఇలా వ్యక్తిగత జీవితంలో అకస్మాత్తుగా వచ్చిన మలుపు స్మృతి అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఆమె స్పష్టమైన ప్రకటన ఇవ్వడంతో వార్తలపై సాగుతున్న ఊహాగానాలకు ముగింపు పలికినట్టైంది.

