తిరుమల పరకామణి చోరీ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సాక్షిగా ఉన్న సతీష్ కుమార్ అనుమానాస్పదంగా మరణించిన తర్వాత పరిణామాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఇక అప్పటి నుంచి కేసు దర్యాప్తును వేగం పెంచారు అధికారులు. అటు హైకోర్ట్ కూడా సాక్ష్యులకు భద్రత కల్పించాలనే ఆదేశాలు ఇవ్వడంతో.. కేసులో ఏ అంశాలు వెలుగులోకి వస్తాయా అనేది ఆసక్తిగా మారింది. ఈ అంశంలో.. తాజాగా టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని కూడా పోలీసులు విచారించారు.
Also Read : బెజవాడ వాసులకు పారిశుధ్య మోక్షం
వైవీ సుబ్బారెడ్డిని సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ ప్రశ్నించారు. నిందితుడు రవికుమార్ తో ఉన్న సంబంధాలపై సీఐడీ ఆరా తీసింది. అప్పటికే ఓ కేసులో నిందితుడిగా ఉన్న రవికుమార్.. ఆస్తులను బినామీలపై బదలాయింపుపై సీఐడీ ప్రశ్నలు వేసినట్టు తెలుస్తోంది. రవికుమార్ ఆస్తులు రాయించుకోవడంలో ఎవరి ప్రమేయం ఉంది? రూ.14 కోట్ల ఆస్తుల విషయంలో గిఫ్ట్ డీడ్ ఇవ్వడంపై వెనుక కారణాలు..? లోక్ అదాలత్లో రాజీ ప్రతిపాదనలు ఎవరు చేశారు? వంటి ప్రశ్నలను సిఐడీ సంధించింది.
Also Read : బెజవాడ రూపు రేఖలు మారుతున్నాయి..!
విరాళాల స్వీకరణపై ప్రకటన జారీ చేశారా అంటూ సీఐడీ ప్రశ్నలు వేసింది. నిందితుడి ఆస్తులు టీటీడీకి తీసుకునే సమయంలో ఆరా తీశారా? అని ప్రశ్నించింది. తెర వెనుక ఏం జరిగిందనే కోణంలో సీఐడీ విచారణ వేగవంతం చేసింది. కొన్ని ప్రశ్నలకు వైవీ సుబ్బారెడ్డి సమాధానాలు దాటవేశారని వార్తలు వస్తున్నాయి. విచారణపై వైవీ స్పందించారు. పరకామణిలో చోరీ అంశంపై సీఐడీ నన్ను ప్రశ్నించిందని, సీఐడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పానని పేర్కొన్నారు. విచారణకు అన్ని విధాలా సహకరిస్తానని చెప్పానని, నా హయాంలో చోరీ జరిగిందని అడిగారని పేర్కొన్నారు. నా పదవీకాలం ముగిసిన తర్వాత చోరీ అంశం బయటపడిoదని పేర్కొన్నారు.

