2024 ఎన్నికల్లో వైసీపీ అధినేత వైయస్ జగన్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు అప్పట్లో చాలా సంచలనమయ్యాయి. నియోజకవర్గాల్లో స్థిరపడిన నాయకులను మరో నియోజకవర్గానికి పంపడం చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. నెల్లూరు జిల్లాకు చెందిన అనిల్ కుమార్ యాదవ్.. నరసరావుపేట ఎంపీగా పోటీ చేయడం, చిత్తూరు జిల్లాకు చెందిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలు ఎంపీగా పోటీ చేయడం.. చిలకలూరిపేట నియోజకవర్గానికి చెందిన విడుదల రజిని గుంటూరులో పోటీ చేయడం వంటివి చూసి ఆశ్చర్యపోయారు. చాలా నియోజకవర్గాల్లో ఈ మార్పులు జరిగాయి.
Also Read : బీహార్ లో ఎన్డీఏ జయకేతనం – పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ సర్వే
ఇక ఇప్పుడు కూడా నియోజకవర్గంలో కీలక మార్పులు దిశగా జగన్ అడుగులు వేస్తున్నారు. వాస్తవానికి చిలకలూరిపేట నియోజకవర్గానికి చెందిన విడుదల రజినీని.. ఇప్పుడు రేపల్లెకు మార్చాలని వైయస్ జగన్ భావిస్తున్నట్లు సమాచారం. చిలకలూరిపేట నియోజకవర్గంలో విడుదల రజనీపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. అక్కడ వ్యాపారులతో పాటుగా రైతులను కూడా ఆమె వేదించారు అనేది ప్రధాన విమర్శ. ఇక ఇప్పుడు రేపల్లె నియోజకవర్గం లో నాయకత్వ లోపం ఉన్న నేపథ్యంలో.. ఆర్థికంగా బలంగా ఉన్న ఆమెను అక్కడికి పంపిస్తే మంచి ఫలితం ఉంటుందనే భావనలో జగన్ ఉన్నట్లు సమాచారం.
Also Read :తిరుమల లడ్డూ ప్రసాదం.. పవన్ ఘాటు వ్యాఖ్యలు..!
వాస్తవానికి రేపల్లె నియోజకవర్గంలో మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ వైసీపీకి బలమైన నాయకుడుగా ఉండేవారు. కానీ 2024 ఎన్నికల్లో ఆయనను కాదని ఈపూరు గణేష్ కు అక్కడ సీట్ కేటాయించారు. అక్కడి స్థానిక నాయకత్వం ఆయనను పెద్దగా అంగీకరించలేకపోయింది. దానికి తోడు మోపిదేవి నాయకత్వాన్ని ఇష్టపడే వైసీపీ క్యాడర్ గణేష్ కోసం పనిచేయలేదనే వ్యాఖ్యలు కూడా వినిపించాయి. ఇక ఎన్నికల తర్వాత గణేష్ సైలెంట్ అయిపోయారు. మోపిదేవి వెంకటరమణ పార్టీ మారిపోయారు. దీనితో ఇప్పుడు నియోజకవర్గంలో నాయకత్వ లోపం అనేది స్పష్టంగా కనబడుతోంది. కాబట్టి విడుదల రజినినీ అక్కడికి పంపిస్తే బాగుంటుందని జగన్ భావిస్తున్నట్లు ఈ మధ్యకాలంలో ప్రచారం మొదలైంది. అయితే ఆమె మాత్రం ఈ నిర్ణయాన్ని పెద్దగా స్వాగతించలేదని సమాచారం. తనను చిలకలూరిపేట లోనే ఉంచాలని ఆమె కోరుతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

