బాలీవుడ్ స్టార్ హీరో ధర్మేంద్ర తుది శ్వాస విడిచారు. గత 20 రోజుల నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ధర్మేంద్రను ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు జాయిన్ చేశారు. వయోభార సమస్యలతో ఇబ్బంది పడుతున్న ధర్మేంద్రకు ఇటీవల కాలంలో పలుమార్లు వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. ఆయన ఆరోగ్యం విషమించినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను ఆయన కుమారుడు సన్ని డియోల్ కొట్టిపారేసిన సంగతి తెలిసిందే. ఇక ఆరోగ్యం మరింత విషమించడంతో.. ఇవాళ తుదిశ్వాస విడిచారు. ధర్మేంద్ర మరణ వార్త బాలీవుడ్ను, దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
Also Read : వైసీపీ గేమ్ ప్లాన్ ఫెయిల్ అయినట్లే..!
ప్రస్తుతం 89 ఏళ్ల వయసులో ఉన్న ధర్మేంద్ర కొన్ని దీర్ఘకాలిక సమస్యలతో కూడా బాధపడుతున్నట్లు బాలీవుడ్ మీడియా పేర్కొంది. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో ఆయన తుది శ్వాస విడిచారు. 1935 డిసెంబర్ 8న పంజాబ్ లో జన్మించారు ధర్మేంద్ర. ధర్మేంద్ర అసలు పేరు ధర్మేంద్ర కేవల్ కిషన్ డియోల్. ధర్మేంద్ర ప్రస్తుత సతీమణి అలనాటి బాలీవుడ్ అందాల తార హేమమాలిని. 1954లో ధర్మేంద్ర ప్రకాష్ కౌర్ ను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత హేమ మాలినితో ప్రేమలో పడి ఆమెను రెండవ వివాహం చేసుకున్నారు.
Also Read : చెవిలో ఇయర్ బడ్స్ పెట్టొద్దు.. మరి ఎలా శుభ్రం చేసుకోవాలి..?
వీళ్ళిద్దరూ పలు సినిమాల్లో హిట్ కాంబినేషన్ గా పేరు తెచ్చుకున్నారు. ధర్మేంద్రకు సన్నీ, బాబి సహా మొత్తం ఆరుగురు సంతానం. త్వరలో విడుదల కానున్న ఇక్కీస్ అనే సినిమాలో ధర్మేంద్ర చివరిసారి నటించారు. 2012లో పద్మభూషణ్ అవార్డు కూడా సొంతం చేసుకున్నారు ధర్మేంద్ర. అటు రాజకీయాల్లో కూడా కొంత ప్రభావం చూపించారు ఈ స్టార్ హీరో. 2004లో బికనీర్ నుంచి బిజెపి ఎంపీగా విజయం సాధించిన ఆయన ఆ తర్వాత మళ్లీ రాజకీయాల వైపు చూడలేదు. మొత్తం 300కు పైగా చిత్రాల్లో నటించిన ధర్మేంద్రను బాలీవుడ్ హీ మ్యాన్ గా పిలుస్తారు.

