శ్రీకాకుళం జిల్లా కాశిబుగ్గలో ఘోర ప్రమాదం జరిగింది. ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని పెద్ద ఎత్తున భక్తులు స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయానికి దర్శనం కోసం వెళ్లగా.. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఊహించిన దాని కంటే భారీగా భక్తులు ఆలయానికి రావడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారందరూ స్థానిక మహిళలుగా తెలుస్తోంది. అయితే ఘటనకు సంబంధించిన పూర్తి కారణాలు ఇంకా తెలియ రాలేదు.
Also Read : చంద్రబాబు ఫోటోతో రాజకీయం
ఒక్కసారిగా భక్తులు దర్శనం కోసం క్యూ లైన్ లో ముందుకు వెళ్లడంతోనే ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెప్తున్నారు. ప్రమాదంలో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. భక్తులు రైలింగ్ పట్టుకోవడంతో ఒకసారిగా అది కూలిపోయిందని సమాచారం. దీనితో భారీగా తొక్కిసలాట జరగడంతో భక్తులు బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన వెంటనే మంత్రులు అచ్చం నాయుడు, కొండపల్లి శ్రీనివాస్, స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష ఘటన స్థలానికి చేరుకున్నారు. ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా ఇతర మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Also Read : ఆ ఎమ్మెల్యేల లిస్ట్ కావాలి.. చంద్రబాబు సంచలన ఆదేశాలు
ఇక ఈ ఆలయం విషయానికొస్తే.. ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యం పొందినట్లుగా తెలుస్తోంది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్లిన ఓ భక్తుడు.. తనను ఆలయంలోకి అనుమతించకపోవడంతో, తన సొంత ఊరిలోనే వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాడు. టీటీడీ అధికారులపై కోపంతో నిర్మించిన ఈ ఆలయానికి భక్తుల తాకిడి ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఉన్నట్లు స్థానికులు చెప్తున్నారు. ఏకాదశి పర్వదినం సందర్భంగా అధికారుల పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిన సరే.. భక్తుల తాకిడి ఎక్కువగానే ఉండటంతో ఘటన జరిగినట్లు సమాచారం.

