మోంథా తుఫాను విషయంలో ఆంధ్రప్రదేశ్ అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఎక్కడికక్కడ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ జాగ్రత్తలు తీసుకుంది. తుఫాను ప్రభావం ఉభయగోదావరి జిల్లాలతో పాటుగా ప్రకాశం, కృష్ణ జిల్లాలపై ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ కూడా అంచనా వేయడంతో ఏపీ సర్కార్ జాగ్రత్త పడింది. అయితే ఇక్కడ తెలంగాణకు తుఫాను ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువగా తెలంగాణ పైనే ప్రభావం చూపించింది తుఫాన్. తీరం దాటిన తర్వాత నేరుగా తెలంగాణలో అడుగుపెట్టింది.
Also Read : బ్రేకింగ్: కల్తీ నెయ్యి కేసులో తొలి రాజకీయ అరెస్టు..!
ఇక అక్కడి నుంచి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, హైదరాబాద్, సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో తుఫాన్ ప్రభావానికి నదులు పొంగిపొర్లుతున్నాయి. వరంగల్ నుంచి వచ్చే మున్నేరు నది ప్రవాహం భారీగా పెరిగింది. సూర్యాపేటలో 73 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. వరంగల్ జిల్లాలో 42 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. ప్రస్తుతం వర్షం తగ్గిన సరే వరంగల్ నగరం మొత్తం వరద నీటితో నిండిపోయింది. అధికారులు కూడా ముందుగా అంచనా వేయకపోవడంతో పరిస్థితి చేయి దాటిపోయినట్లు తెలుస్తోంది.
Also Read: స్పిరిట్ కోసం ప్రభాస్ కొత్త లుక్.. వేరే లెవెల్ ప్లాన్..!
నేడు కూడా తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అప్రమత్తం చేసింది. తెలంగాణ నుంచి మున్నేరుకు రెండు లక్షల క్యూసెక్కుల వరద వచ్చినట్లు అధికారులు అంచనా వేశారు. వరద తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. కృష్ణానది ఉపనదులన్నీ తెలంగాణ నుంచి రావడంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి ఎక్కువైంది. ప్రకాశం బ్యారేజ్ కు గురువారం ఆరు లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశం ఉందని జలవనరుల శాఖ అధికారులు అంచనా వేశారు. మొత్తంగా చూస్తే తుఫాను ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ నష్టం తెలంగాణకే చేసినట్లు స్పష్టంగా అర్థం అవుతుంది. ప్రస్తుతం భద్రాచలం సమీపంలో తుఫాను కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

