గత నాలుగు రోజుల నుంచి రాష్ట్రాన్ని కలవరపెట్టిన మోంథా తుఫాన్ ఎట్టకేలకు తీరం దాటడం, ప్రాణ నష్టం తక్కువగా ఉండటం పట్ల సిఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేసారు. తాజాగా దీనిపై సమీక్షా సమావేశం నిర్వహించిన సిఎం.. కలెక్టర్లు, అధికారులు, మంత్రులతో స్వయంగా మాట్లాడారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై అధికారులు, మంత్రులకు సూచనలు చేసారు. బాధితులకు నిత్యావసర సరకులు అందించాలని ఆదేశించిన సిఎం.. తుఫాన్ నష్టాన్ని త్వరగా అంచనా వేయాలని స్పష్టం చేసారు.
Also Read : కొత్త జిల్లాల ఏర్పాటు, రెవెన్యూ డివిజన్లు.. చంద్రబాబు కీలక నిర్ణయాలు
సమర్థవంతంగా వ్యవహరించి, నష్ట నివారణ చర్యలు చేపట్టాం.. సీఎం నుంచి సచివాలయం సిబ్బంది వరకు అందరూ టీమ్ గా పనిచేశామని, కష్టకాలంలో బాధితుల కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. మరో రెండు రోజులు ఇలానే పనిచేస్తే మరింత ఊరట ఇవ్వగలమన్నారు చంద్రబాబు. మంత్రులు, అధికారులు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలి.. ప్రభుత్వం ఏం చేసిందో చెబుతూ.. సమస్యలు ఉంటే అడిగి తెలుసుకోవాలని ఆదేశించారు. వివిధ విభాగాల్లో నష్టం అంచనా వేసి కేంద్రానికి నివేదిక అందివ్వాలన్నారు.
Also Read : సాక్షి కులం రాతలు.. కాపు మహిళపై ప్రచారం
బాధితులకు నిత్యావసర సరకులు వెంటనే అందించాలని, ముందస్తు చర్యల వల్లే నష్టాన్ని చాలావరకు నివారించగలిగామన్నారు. తుపానును నివారించలేము.. ముందుజాగ్రత్తలతో నష్టాలు నివారించగలుగుతామని పేర్కొన్నారు. కలెక్టర్లు, అధికారులు రియల్ టైమ్ సమాచారం తెప్పించుకున్నారు.. ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది బాగా పనిచేశారని కొనియాడారు. చెట్లు కూలినా, విద్యుత్ వైర్లు తెగిపడినా యుద్ధప్రాతిపదికన తొలగించారు.. మున్సిపాలిటీల్లో డ్రెయిన్ల శుభ్రం వల్ల ముంపు బారిన పడకుండా చేశామని తెలిపారు. దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణకు 10 వేల మందిని అందుబాటులో ఉంచాం.. ఇవాళ మధ్యాహ్నానికి సాధారణ స్థితి ఏర్పడుతుందన్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు అందుబాటులో ఉంటే ప్రభుత్వంపై నమ్మకం కలుగుతుందన్నారు. మన చర్యలతో ప్రభుత్వంపై ప్రజలకు భరోసా పెరిగిందన్నారు.

