ఏపీలో మొంథా తుఫాన్ తీవ్ర నష్టం మిగిల్చింది. తుఫాన్ తాకిడికి ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఇప్పటికే ఏపీలో 10 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. తుఫాన్ తీరం దాటిన తర్వాత మరో 24 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టింది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. రహదారులపై రాకపోకలు లేకుండా ఆంక్షలు విధించారు. ఆస్తి నష్టం కూడా పెద్దగా లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక పంట నష్టం అంచనా కూడా మరో రెండు రోజుల్లోనే ప్రారంభిస్తామని వ్యవసాయ శాఖ ఇప్పటికే ప్రకటించింది. తుఫాన్ తీరం దాటడంతో ప్రభుత్వ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
Also Read : నేనేంటో చూస్తారు.. మంత్రుల వద్ద చంద్రబాబు కామెంట్..?
మొంథా తుఫాన్ ఏపీపై తీవ్ర ప్రభావం చూపిస్తుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు. దుబాయ్ నుంచి నేరుగా అమరావతి చేరుకున్న చంద్రబాబు.. కమాండ్ కంట్రోల్ రూమ్లో అధికారులతో నిరంతరం పర్యవేక్షించారు. ఆర్టీజీఎస్ ద్వారా ఏపీ ప్రజలకు, అధికారులకు తగిన సూచనలు, జాగ్రత్తలు చెప్పారు. ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. విపత్తు నివారణ శాఖ అధికారులతో, హోమ్ మంత్రి అనిత, మంత్రి లోకేష్తో కలిసి సమీక్షలు నిర్వహించారు. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితులపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యవేక్షణ చేశారు. మంగళవారం సాయంత్రం నుంచి ఆర్టీజీఎస్లోనే ఉన్న సీఎం చంద్రబాబు.. బుధవారం తెల్లవారుజామున.. సుమారు 12 గంటల తర్వాత ఇంటికి చేరుకున్నారు. మళ్లీ ఉదయం 8 గంటలకే నుంచే జరుగుతున్న సహాయక చర్యలపై ఆరా తీస్తున్నారు. అదే సమయంలో బాధితులకు అందుతున్న సౌకర్యాల గురించి రియల్ టైమ్ ద్వారా మానిటరింగ్ చేస్తున్నారు చంద్రబాబు.
Also Read : బెజవాడలో అఖండ తాండవం.. క్రేజీ అప్డేట్..!
ఇదే సమయంలో ఏపీలో ప్రతిపక్ష హోదా కావాలని పట్టుబడుతున్న వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం.. బెంగళూరు ఎలహంక ప్యాలెస్కు పరిమితం అయ్యారు. తుఫాన్, భారీ వర్షం ఉంటుందని ముందుగా హెచ్చరికలు జారీ చేసినప్పటికీ.. జగన్ మాత్రం మంగళవారం ఉదయమే బెంగళూరు నుంచి గన్నవరం వచ్చేందుకు ప్లాన్ చేశారు తప్ప.. సోమవారం రాత్రి వచ్చేందుకు విముఖత చూపారు. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో మంగళవారం నుంచి అన్ని విమాన సర్వీసులను కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ రద్దు చేసింది. దీంతో విమానం లేదనే సాకుతో జగన్ బెంగళూరు నుంచి బయటకు రాలేదు. వాస్తవానికి గన్నవరం వచ్చే విమానాలపై మాత్రమే ఆంక్షలున్నాయి. హైదరాబాద్, కడప, కర్నూలు సర్వీసులపై ఎలాంటి ఆంక్షలు లేవు. జగన్ తన సొంత నియోజకవర్గంలో ప్రజల గురించి కూడా పట్టించుకోలేదనే మాట వినిపిస్తోంది.
నిజానికి చంద్రబాబు కుటుంబంలో ఆయన తమ్ముడు కుమారుడు నటుడు నారా రోహిత్ వివాహం జరుగుతోంది. ఆ వివాహ వేడుకలకు కూడా చంద్రబాబు, లోకేష్ దూరంగా ఉన్నారు. ఇతర కుటుంబ సభ్యులంతా వివాహ వేడుకల్లో పాల్గొంటే.. చంద్రబాబు, లోకేష్ మాత్రం తుఫాన్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. కానీ జగన్ మాత్రం బెంగళూరు ప్యాలెస్ నుంచి కాలు కూడా బయటపెట్టలేదు. సొంత జిల్లా కడప ప్రజలు భారీ వర్షాలతో ఇబ్బందులు పడుతుంటే జగన్ మాత్రం కనీసం రోడ్డు మార్గాన కూడా రాలేదనే మాట బాగా వినిపిస్తోంది. గతంలో కూడా హుద్ హుద్ తుఫాన్ సమయంలో జగన్ హైదరాబాద్లో అవెంజర్స్ సినిమా చూశారు. ప్రకృతి విపత్తుల సమయంలో చంద్రబాబు ఇలా.. జగన్ అలా వ్యవహరిస్తున్నారని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

