కృష్ణాజిల్లా టిడిపి వ్యవహారాలపై తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దాదాపు రెండు మూడు నెలల నుంచి ఈ వ్యవహారాలపై కార్యకర్తల్లో అసహనం కనపడటం, అటు వైసిపి కి కూడా ఇవి అవకాశం ఇచ్చే సూచనలు కనపడుతున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు తాజాగా పార్టీ నేతలు వద్ద కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. తాజాగా క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ సందర్భంగా చంద్రబాబు ఇద్దరు మంత్రుల వద్ద ఈ అంశం గురించి మాట్లాడినట్లు సమాచారం.
Also Read : తప్పుడు ఆరోపణలు.. వాస్తవాలు..!
పార్టీలో క్రమశిక్షణ లోపిస్తే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో గత వారం పది రోజుల నుంచి తాను చూస్తున్నానని, కొందరు నేతలు పార్టీ ప్రతిష్టను, ప్రభుత్వ ప్రతిష్టను సైతం భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. నియోజకవర్గాల్లో జరిగే అంశాలను ఇన్చార్జి మంత్రులు పరిశీలించాలని, మాదకద్రవ్యాలతో పాటుగా అక్రమ రవాణాల విషయంలో తీవ్ర విమర్శలు వస్తున్న సందర్భంలో ప్రభుత్వానికి ఇబ్బందికర పరిణామాలు ఉంటాయని చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.
Also Read : ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.. అసలు ఏమైంది..?
2019 సమయంలో వీటిని వైసీపీ అనుకూలంగా మార్చుకుని పార్టీపై తప్పుడు ప్రచారం చేసిందని, ఇప్పుడు మళ్లీ అదే అవకాశాన్ని వైసీపీకి ఇస్తున్నామని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. కేవలం ఉమ్మడి కృష్ణా జిల్లాలో మాత్రమే కాదని చాలా జిల్లాల్లో పరిస్థితి ఇదే విధంగా ఉన్నాయని, అవసరమైతే సస్పెండ్ చేయడానికి కూడా తాను వెనకాడేది లేదని చంద్రబాబు స్పష్టం చేసినట్లు సమాచారం. కూటమిలో కూడా విభేదాలు తెచ్చే విధంగా కొందరు ప్రవర్తిస్తున్నారని, వారి విషయంలో కూడా కఠిన నిర్ణయాలు ఉండవచ్చని చంద్రబాబు అభిప్రాయ పడినట్లు తెలుస్తోంది. త్వరలోనే తాను తీసుకునే నిర్ణయాలు ఏంటో అందరికీ అర్థమవుతాయని, ఆ తర్వాత పరిణామాలకు నేతల బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా చంద్రబాబు స్పష్టం చేసినట్లు సమాచారం.

