ఐసీసీ నిర్వహించే టోర్నీలకు ప్రత్యేకమైన చరిత్ర ఉంటుంది. అందులో ఆసియా కప్ ఒకటి. దాదాపు 41 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ టోర్నమెంట్లో ఇప్పటివరకు భారత జట్టు ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వస్తోంది. ఆ తరువాత స్థానంలో శ్రీలంక ఉంది. ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్లో టీమిండియా లీగ్ దశలో మూడు మ్యాచ్లు గెలిచి, సూపర్ ఫోర్లోనూ వరుస విజయాలు సాధించి, ముందుగానే ఫైనల్కు చేరుకుంది. మరోవైపు, బంగ్లాదేశ్ పై విజయం సాధించిన పాకిస్తాన్ కూడా ఫైనల్కు అర్హత సాధించింది.
Also Read : పాక్ క్రికెటర్లకు భారత్ షాక్..!
లీగ్ దశలోనూ, సూపర్ ఫోర్ దశలోనూ భారత్, పాకిస్తాన్ తలపడ్డాయి. రెండు సార్లూ టీమిండియానే విజయం సాధించింది. లీగ్ మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో, సూపర్ ఫోర్లో 6 వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. 41 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా ఆసియా కప్ ఫైనల్లో భారత్–పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ఈ హై వోల్టేజ్ ఫైనల్ సెప్టెంబర్ 28న జరగనుంది. ఇక ఐసీసీ టోర్నీల్లో భారత్–పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్లు చాలా అరుదు. 2007 టి20 వరల్డ్కప్ ఫైనల్లో భారత్ గెలుపొందగా, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్తాన్ విజయం సాధించింది.
Also Read : పవన్ సెంటిమెంట్ బ్రేక్ చేసిన సుజిత్..?
కానీ ఇటీవల ఐసీసీ టోర్నీల్లో భారత్ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. వరుసగా ఏడు మ్యాచ్ల్లో భారత్ విజయం సాధించి పాకిస్తాన్పై ఆధిపత్యాన్ని చాటింది. ప్రస్తుత ఆసియా కప్లోనూ రెండు సార్లు పాకిస్తాన్ను ఓడించిన టీమిండియా, ఫైనల్లోనూ అదే విజయ పరంపరను కొనసాగించాలని అభిమానులు ఆశాభావాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫైనల్ లో భారత జట్టు విజయం సాధిస్తే తొమ్మిది సార్లు భారత్ ఆసియా కప్ గెలిచిన జట్టుగా నిలుస్తుంది. సూపర్ ఫోర్ దశలో జరిగిన మ్యాచ్ లో పాక్ ఆటగాళ్ల ప్రవర్తన పై బిసిసిఐ ఇప్పటికే ఐసిసి కి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఫైనల్ మ్యాచ్ కూడా రసవత్తరంగా సాగుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.