దాదాపు నెల రోజులుగా ఆసక్తిని రేపుతోన్న టీం ఇండియా స్పాన్సర్ విషయంలో క్లారిటీ వచ్చింది. భారత క్రికెట్ జట్టు కొత్త జెర్సీ స్పాన్సర్గా అపోలో టైర్స్ ఎంపిక అయింది. పలు కంపెనీల పేర్లు ప్రచారంలో ఉన్నా చివరికి అపోలో టైర్స్ ను ఎంపిక చేసారు. 2027 వరకు అపోలో టైర్స్ కు స్పాన్సర్ హక్కులు ఉంటాయి. బెట్టింగ్ సంబంధిత యాప్స్ పై భారత ప్రభుత్వం నిషేధం విధించిన తర్వాత, భారత క్రికెట్ నియంత్రణ మండలి డ్రీమ్11తో తన ఒప్పందాన్ని రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే.
Also Read : సజ్జల అవుట్.. సతీష్ రెడ్డి ఇన్.. జగన్ కీలక ఆదేశాలు
ఆ తర్వాతి నుంచి కొత్త కంపెనీలకు స్వాగతం పలికింది బోర్డు. అపోలో టైర్స్ బోర్డుకు ఒక్కో మ్యాచ్కు రూ.4.5 కోట్లు చెల్లిస్తుంది. డ్రీమ్11 గతంలో రూ.4 కోట్ల రూపాయలు చెల్లించింది. భారత క్రికెట్ జట్టు అంతర్జాతీయ క్రికెట్ క్యాలెండర్ను దృష్టిలో ఉంచుకుని అపోలో టైర్స్ ఈ ఒప్పందానికి ముందుకు వచ్చింది. బోర్డుకు దీని ద్వారా భారీ లాభాలు రానున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్లో భారత పురుషుల జట్టుకు స్పాన్సర్ లేని సంగతి తెలిసిందే. అలాగే ఆస్ట్రేలియాతో జరిగే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో మహిళల జట్టుకు కూడా స్పాన్సర్ లేదు.
Also Read : వైసీపీ నేతలకు ఆ మాత్రం తీరక లేదా..!
టయోటా, మైక్రోసాఫ్ట్ ఈ ఒప్పందం కోసం ముందుకు వచ్చినట్టు ప్రచారం జరిగింది. కానీ చివరకు అనూహ్యంగా అపోలో టైర్స్ తో బోర్డు ఒప్పందం చేసుకుంది. విండీస్ తో టెస్ట్ సీరీస్ నుంచి భారత జట్టుకు స్పాన్సర్ గా అపోలో టైర్స్ వ్యవహరిస్తుంది. ఆసియా కప్ లో మాత్రం స్పాన్సర్ లేకుండానే జట్టు ఆడనుంది. అటు మహిళా జట్టుతో పాటుగా అండర్ 19 జట్టుకు కూడా స్పాన్సర్ గా వ్యవహరిస్తుంది.