తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిని కలిగిస్తున్న కల్వకుంట్ల కవిత వ్యవహారం.. ఏ మలుపు తిరగబోతుందో అంచనా వేయడం కాస్త కష్టంగానే ఉంది. సొంత కుటుంబం పైనే విమర్శలు చేసిన కవిత.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తారంటూ ప్రచారం కూడా జరుగుతుంది. ఇక కవితను కంట్రోల్ చేసేందుకు ఇన్ని రోజులు ప్రయత్నాలు చేసిన కేసీఆర్.. ఆమె వైఖరి మరింత ఇబ్బందికరంగా మారడంతో సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం తర్వాత కవితను సస్పెండ్ చేస్తూ బిఆర్ఎస్ పార్టీ ఓ లేఖను విడుదల చేసింది.
Also Read : నీకు, మాకు రాం రాం.. కారు దిగిపో..!
ఇదిలా ఉంచితే ఇప్పుడు కవితను ఎలాగైనా దగ్గర చేసుకోవాలని భారతీయ జనతా పార్టీ ప్రయత్నాలు చేస్తున్నట్లు రాజకీయ వర్గాలు అంటున్నాయి. గులాబీ పార్టీ నుంచి కవిత సస్పెండ్ కావడంతో తమ పార్టీలోకి ఆహ్వానించాలని బిజెపి రాష్ట్ర నాయకత్వం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ మంగళవారం సాయంత్రం ఫోన్ లో మాట్లాడినట్లు మీడియా వర్గాలలో చర్చ మొదలైంది. బిజెపి ఈ మధ్యకాలంలో కవితపై ఎక్కడ విమర్శలు చేయలేదు. గతంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శలు చేసినా సరే.. గత ఏడాది కాలంగా ఆమె విషయంలో సైలెంట్ గానే ఉన్నారు.
Also Read : అంతా మేమే.. మొత్తం మాకే..!
ఇక బండి సంజయ్ ఆమెకు ఫోన్ చేసి బిజెపిలోకి రావలసిందిగా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఒక కీలక పదవిని కూడా ఆమెకు ఆఫర్ చేసినట్లు సమాచారం. కవిత ఎలాగూ కాంగ్రెస్ కు దగ్గరఅయ్యే అవకాశాలు లేకపోవడం.. సొంతగా పార్టీ పెట్టే ఆలోచన ఉందనే ప్రచారం జరుగుతున్న సరే అందులో వాస్తవం తక్కువగా ఉండటం.. అందుకే కవితను తమ పార్టీలోకి ఆహ్వానించి.. రాజకీయంగా గులాబీ పార్టీని ఇబ్బంది పెట్టవచ్చని బిజెపి భావిస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి బండి సంజయ్ ఇప్పటికే బీజేపీ పెద్దలతో కూడా సంప్రదింపులు జరిపారు. అటు లిక్కర్ కేసు కూడా కవిత కు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉండటంతో.. ఆమె బిజెపి వైపు చూడవచ్చు అంటున్నాయి రాజకీయ వర్గాలు.