తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమంటోంది. కిరోసిన్, పెట్రోల్ కూడా వేయకుండానే.. కేవలం చూపులతోనే నిప్పు పుట్టించే పరిస్థితి. కొంతమంది నేతల గురించి అయితే ఈ మాట ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కరుడుగట్టిన అభిమానులు అయితే.. పసుపు కనిపించినా.. సైకిల్ కనిపించినా చాలు.. మరింత రెచ్చిపోతారు. ఇలాంటి వారిలో కొడాలి నాని, రోజా, పేర్ని నాని, అంబటి రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్ వంటి నేతలతో పాటు వైసీపీ సస్పెన్షన్కు గురైన దువ్వాడ శ్రీనివాస్ కూడా ఉన్నారు. టీడీపీ కార్యకర్త మొదలు అధినేత వరకు వీరికి శత్రువులే. పసుపు జెండా కనిపించినా సరే రగిలిపోతారు.
దువ్వాడ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జగన్ నా దేవుడు అని గొప్పగా చెప్పిన వ్యక్తి. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నాటి టెక్కలి ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఇంటి ముందు జీపుపై కత్తి పట్టుకుని కూర్చుని బూతులతో రెచ్చిపోయారు. ఇక కుటుంబ వివాదం కారణంగా ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండింగ్లోనే ఉన్నారు. దివ్వెల మాధురితో సహజీవనం చేస్తూ.. వీడియోలు చేస్తూ.. రాజా రాజు అంటూ తెగ వైరల్ అయ్యారు. టీడీపీ గురించి, ఆ పార్టీ నేతల గురించి పదే పదే విమర్శలు చేశారు దువ్వాడ శ్రీనివాస్.
Also Read : కూన ఎపిసోడ్లో కులం రచ్చ..!
అలాంటి దువ్వాడ ఇప్పుడు ఓ టీడీపీ ఎమ్మెల్యేకు అనుకూలంగా మాట్లాడటం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్పై కేజీవీపీ ప్రిన్సిపాల్ సౌమ్య ఆరోపణలు చేశారు. తనపై కక్షసాధింపు చర్యల్లో భాగంగానే బదిలీ చేశారనేది సౌమ్య ఆరోపణ. తన పరువు తీశారని ఆరోపిస్తూ.. ఆత్మహత్యకు యత్నించారు. దీనిపై ఇప్పుడు పెద్ద వివాదం నడుస్తోంది. ఈ వ్యవహారంపై కూన కూడా ఘాటుగానే స్పందించారు. అయితే ఇక్కడే అసలు తిరకాసు. కూనకు అనుకూలంగా సొంత పార్టీ నేతలు కనీసం ఒక్కరు కూడా మాట్లాడటం లేదు. జిల్లాకు చెందిన మంత్రి, కేంద్ర మంత్రి కూడా కనీసం కూనకు సంఘీభావం తెలపలేదు. కానీ ఈ విషయంలో కూన రవికుమార్కు దువ్వాడ శ్రీనివాస్ అండగా నిలిచారు
కూన రవి ఎపిసోడ్లో దువ్వాడ శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు. కూన విషయంలో జిల్లాకు చెందిన కింజరాపు, ధర్మాన కుటుంబాలు సౌమ్యను బలిపశువు చేశాయని ఆరోపించారు. గతంలో టీడీపీ జిల్లా అధ్యక్షునిగా, విప్గా కూడా కూన వ్యవహరించారని.. అప్పుడు కూడా రవి పైన ఎలాంటి ఆరోపణలు రాలేదన్నారు. అయినా ప్రభుత్వ ఉద్యోగిని బదిలీ చేయడం వేధింపులు ఎలా అవుతాయన్నారు. బదిలీ చేసింది కలెక్టర్ అయితే.. కూన రవికుమార్ను ఎందుకు తప్పుపడుతున్నారని దువ్వాడ ప్రశ్నించారు. జిల్లాలో కింజరాపు కుటుంబం పెత్తనం ఎక్కువగా ఉందని.. ఒకే కుటుంబానికి రెండు మంత్రి పదవులు ఎలా ఇస్తారని చంద్రబాబును ప్రశ్నించారు. ఉద్యోగులను అచ్చెన్నాయుడు వేధింపులకు గురి చేస్తున్నారని.. ఎంతో మందిని మన్యం ప్రాంతాలను బలవంతపు బదిలీలు చేయించారని ఆరోపించారు. తాను సూచించిన వారికి కాంట్రాక్ట్ ఇవ్వాలని వ్యవసాయ శాఖ ఉన్నతోద్యోగిపై ఒత్తిడి తీసుకువచ్చారని.. అలా చేయలేక ఆయన సెలవుపై వెళ్లారనేది దువ్వాడ ఆరోపణ.
Also Read : ఆన్లైన్ గేమింగ్ బిల్.. బెట్టింగ్ కు పాల్పడితే అంతే..!
జిల్లాలో ధర్మాన, కింజరాపు కుటుంబాలు పెత్తనం చేస్తున్నాయని.. ఇక సామాజిక వర్గాలకు తీరని అన్యాయం చేస్తున్నాయనేది దువ్వాడ మాట. ఈ వ్యవహారంలో కూనకు తన మద్దతు ఉంటుందన్నారు. మంత్రి పదవి రేసులో ఉన్నాడు కాబట్టే కూనకు వ్యతిరేకంగా అచ్చెన్నాయుడు కుట్రలు చేస్తున్నారన్నారు. కూన వేధించినట్లు ఆరోపిస్తున్న సౌమ్య.. అందుకు తగిన రుజువులు చూపించాలన్నారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే.. తర్వాత తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని దువ్వాడ శ్రీనివాస్ హెచ్చరించారు కూడా. మొత్తానికి నిత్యం నువ్వా – నేనా అన్నట్లు ఉండే వైసీపీ, టీడీపీ నేతలు.. ఇలా మాట్లాడటం రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది.