పారిశ్రామిక కేంద్రంలో ప్రపంచ శ్రేణి మౌళిక సదుపాయాల కల్పనలో శ్రీ సిటీ మరో ముందడుగు వేసింది. నైట్రోజన్ గ్యాస్ పైప్లైన్ ఏర్పాటులో భాగంగా నోవా ఎయిర్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్తో శ్రీ సిటీ ఒప్పందం కుదుర్చుకుంది. దీని ద్వారా ఈ ప్రాంతంలోని తయారీ రంగ పరిశ్రమలకు స్థిరమైన, నాణ్యమైన నైట్రోజన్ గ్యాస్ సరఫరా అవుతుంది. ఒప్పందం మేరకు, నోవా ఎయిర్ సంస్థ సొంతంగా పైప్ లైన్ వ్యవస్థ ప్రణాళిక, నిర్మాణం, నిర్వహణ చేపడుతుంది. పారిశ్రామికవాడ అంతటా సమర్థవంతమైన గ్యాస్ పంపిణీని అనుమతిస్తూ అవసరమైన ప్రత్యేక హక్కులను కంపెనీకి మంజూరు చేసింది. కొనసాగుతున్న పారిశ్రామిక కార్యకలాపాలకు అంతరాయం లేకుండా దశలవారీగా ఈ ప్రాజెక్ట్ అమలు అవుతుందని నిర్వాహకులు తెలిపారు.
Also Read : యూకేలో అడుగుపెట్టిన మోడీ.. కీలక ఒప్పందాల దిశగా అడుగులు..!
శ్రీ సిటీని పారిశ్రామిక మౌళిక సదుపాయాలకు ఉత్తమ నమూనాగా మార్చేందుకే నోవా ఎయిర్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు శ్రీ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి తెలిపారు. పరిశ్రమల అభివృద్ధికి ఆవిష్కరణ, సుస్థిరత, ప్రపంచ స్థాయి సౌకర్యాలు అందించాలన్న తమ నిబద్ధతను ప్రతిబింబిస్తుందన్నారు. ఈ ఒప్పందం పట్ల నోవా ఎయిర్ టెక్నాలజీస్ యాజమాన్యం సంతోషం వ్యక్తం చేసింది. యుటిలిటీ పైప్ లైన్ నెట్వర్క్ సదుపాయం అభివృద్ధి చెందిన దేశాల్లోని పారిశ్రామిక పార్కుల్లో సర్వ సాధారణమైందన్నారు. భారతదేశంలో ఈ తరహా చొరవ ఇదే మొదటిసారి అని వ్యాఖ్యానించారు. వినియోగదారులకు స్థిరమైన, నాణ్యమైన గ్యాస్ సరఫరా పరిష్కారాలను అందించడానికి, ఉత్పాదకతను పెంచడానికి ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం తమకు వీలు కల్పిస్తుందని పేర్కొన్నారు. కీలకమైన ఈ సదుపాయం శ్రీ సిటీ పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని రెండు సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ప్రక్రియ పరిశ్రమల అవసరాలను తీర్చడంలో విశేషంగా ఉపయోగపడడంతో పాటు భవిష్యత్ పెట్టుబడులకు శ్రీ సిటీని మరింత ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మార్చేందుకు దోహద పడుతుందన్నారు.