జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడి నేపధ్యంలో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. పర్యాటకుల భద్రతను దృష్టిలో పెట్టుకుని అప్రమత్తమయ్యాయి. గత వారం పహల్గామ్లో జరిగిన ఉగ్ర దాడుల తర్వాత మరిన్ని ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించడంతో జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కాశ్మీర్లోని 87 పర్యాటక ప్రదేశాలలో 48 ప్రదేశాలను మూసివేసింది. పహల్గామ్ దాడి తర్వాత లోయలోని కొన్ని స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అయ్యాయని గుర్తించింది.
Also Read : సింధూ నది ఒప్పందం రద్దైతే పాక్ లో ఏం జరుగబోతోంది..?
ఈ విషయాన్ని తమ కమ్యూనికేషన్ ఇంటర్సెప్ట్లు నిర్ధారించాయని, కార్యకలాపాలను ప్రారంభించాలని వారికి ఆదేశాలు వెళ్లాయని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడి నేపథ్యంలో, రాబోయే రోజుల్లో భద్రతా దళాలు, స్థానికేతర వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాద సంస్థలు దాడులకు చురుకుగా ప్రణాళికలు రచిస్తున్నాయని నిఘా వర్గాలు వెల్లడించినట్టు జాతీయ మీడియా పేర్కొంది. పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI), ముఖ్యంగా శ్రీనగర్, గండేర్బల్ జిల్లాల్లో స్థానికేతర వ్యక్తులను, కాశ్మీరీ పండిట్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయాలని ప్రణాళిక రచిస్తోందని వెల్లడించాయి.
Also Read : ముస్లిం నాయకుల స్వరం మారిందా..? అలెర్ట్ అయ్యారా..?
పహల్గామ్ మారణహోమానికి పాల్పడిన నిందితుల కోసం వెతుకుతున్న భద్రతా బలగాలు.. రాష్ట్రవ్యాప్తంగా భారీ ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ను ప్రారంభించి జల్లెడ పడుతున్నాయి. వందలాది మంది, అనుమానితులను, ఉగ్రవాద సానుభూతిపరులను అదుపులోకి తీసుకున్నాయి. ఈ మారణహోమంలో స్థానిక ఉగ్రవాది కూడా ఉన్నాడని గుర్తించారు. పలువురి ఇళ్ళను కూడా ధ్వంసం చేశారు. ఉగ్రవాద కార్యకలాపాల నేపధ్యంలో గుల్మార్గ్, సోనామార్గ్, దాల్ సరస్సు ప్రాంతాలతో సహా సున్నితమైన పర్యాటక ప్రదేశాలలో బలగాలను పెద్ద ఎత్తున మొహరించారు.

