ఎంతో ఉత్కంఠ రేపిన ఢిల్లీ శాసనసభ ఎన్నికల ఫలితాలు వచ్చేసాయి. ఎన్నికల్లో తిరిగి అధికారం చేపడుతుందని భావించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఘోరంగా ఓటమిపాలైంది. మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ 3000 పైగా ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. ఢిల్లీలో అధికారం కోసం గట్టిగా ప్రయత్నం చేస్తున్న భారతీయ జనతా పార్టీ ఈసారి గురిపెట్టి కొట్టింది. అరవింద్ కేజ్రీవాల్ మళ్లీ తిరిగి ముఖ్యమంత్రి అవుతారని ముందు భావించినా.. ఆ తర్వాత మాత్రం పరిస్థితి అనుకూలంగా కనపడలేదు. సంవత్సరం క్రితం ఉన్న పరిస్థితులకి, ఇప్పటికి పొంతన లేకుండా ఉంది.
Also Read: టీడీపీలో డేంజర్ సైరన్.. లోకేష్ అలర్ట్ అవ్వాల్సిందే
ఆయన ఓటమి కాకుండా పార్టీ ఓటమికి కూడా ఆయన వ్యవహార శైలి, అదే విధంగా అవినీతి ఆరోపణలు ప్రధాన కారణాలు అయ్యాయి. లిక్కర్ స్కామ్ తో పాటుగా వాటర్ స్కామ్ సహా మరికొన్ని అవినీతి వ్యవహారాలు అరవింద్ కేజ్రీవాల్ క్లీన్ ఇమేజ్ ను దెబ్బతీశాయి. అవినీతికి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ చివరకు అవినీతి ఆరోపణలతో ఓటవి పాలు కావడం సంచలనమైంది. వరుసగా మూడుసార్లు అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ ఇప్పుడు అధికారం కోల్పోయింది. ఏకంగా లిక్కర్ స్కాం లో అరవింద్ కేజ్రీవాల్ జైలుకు కూడా వెళ్లడం ఆయనకు బాగా మైనస్ గానే చెప్పాలి. మరీ ముఖ్యంగా ఈ అవినీతిలో ఆయన పాత్ర ఉందని నమ్ముతున్నట్లు సుప్రీం కోర్టు వ్యవహారశైలి ఉండటంతో ప్రజల్లో ఆలోచన రేకెత్తించింది.
Also Read: విలువలు, విశ్వసనీయత.. ట్వీట్ వార్..!
యువతలో ఆయనకు ఒకప్పుడు మంచి క్రేజ్ ఉండేది కానీ అరెస్టు అయిన తర్వాత ఆ క్రేజ్ క్రమంగా పడిపోయింది. ఇక బిజెపి కూడా అన్ని విధాలుగా కేజ్రీవాల్ ను టార్గెట్ చేసింది. ఒకప్పుడు బిజెపికి పరోక్షంగా సహకరించిన అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు ఆ పార్టీ చేతిలోనే ఘోరంగా ఓటమి పాలు కావడం గమనార్హం. ఇక ఇక్కడి నుంచి ఆయనకు కష్టాలు తప్పేలా లేవు. ఢిల్లీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని బిజెపి పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ వచ్చింది. ఇప్పుడు వాటికి సంబంధించిన ఆధారాలను అన్వేషించే పనిలో పడింది బిజెపి. ఇప్పటికే ఆ రాష్ట్ర సచివాలయాన్ని కూడా సీజ్ చేస్తూ లెఫ్ట్నెంట్ గవర్నర్ ఆదేశాలు ఇచ్చారు. దీనితో.. కేజ్రీవాల్.. రాజకీయ భవిష్యత్తు కూడా ముగిసిపోయే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

