ఈ నెల 5న ఫీజు పోరు నిర్వహించాలని వైసీపీ అధిష్ఠానం నిర్ణయించింది. బకాయి పెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన కింద ఇవ్వాల్సిన రూ.3,900 కోట్లు తక్షణమే విడుదల చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయకపోవడంతో యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికేట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాయని… కాలేజీల నుంచి పంపించేస్తున్నాయని ఆరోపించిన వైసీపీ నేతలు… తక్షణమే ఈ పరిస్థితిని నివారించాలని డిమాండ్ చేస్తున్నాయి. అలాగే పెండింగ్ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు చదువు మధ్యలోనే ఆపేసి పనులకు వెళ్లే దుస్థితి వచ్చిందన్నారు. ప్రభుత్వం తక్షణమే తన వైఖరి మార్చుకుని విద్యార్థులను ఆదుకోవాలంటూ ఫీజు పోరు పేరుతో ధర్నా చేపట్టింది. విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి అన్ని కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లి… డిమాండ్లతో వినతిపత్రం అందజేయాలని వైసీపీ అధిష్ఠానం పిలుపునిచ్చింది.
Also Read :కేంద్ర బడ్జెట్లో హైలెట్స్ ఇవే.. స్టార్టప్లకు పండుగే
అయితే ఇప్పుడు ఇదే విషయంపై పార్టీలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఏపీలో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. దాదాపు 7 ఉమ్మడి జిల్లాలో కోడ్ అమలులో ఉందని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ పరిస్థితుల్లో ఫీజు పోరు తలపెట్టడంపై వైసీపీలో గందరగోళం నెలకొంది. వాస్తవానికి ఇప్పటికే ఫీజు పోరును నాలుగు సార్లు వాయిదా వేశారు. డిసెంబర్ నెలలో నిర్వహించాలని ముందు భావించారు. అయితే వివిధ కారణాలతో వాయిదా వేశారు. ఆ తర్వాత సంక్రాంతి, జగన్ లండన్ పర్యటన అంటూ వాయిదా పడింది. జగన్ లండన్ నుంచి తిరిగి వచ్చిన తర్వవాత ఫిబ్రవరి 5న చేయాలని డేట్ ఫిక్స్ చేశారు. సరిగ్గా ఇదే సమయంలో ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఏం చేయాలనే విషయంపై వైసీపీ నేతలు మల్లగుల్లలు పడుతున్నారు.
Also Read :జంప్ డిపాజిట్… నయా సైబర్ క్రైమ్..!
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఎలాంటి ర్యాలీలు, ధర్నాలు చేయకూడదు. కనీసం నిరసన ప్రదర్శన చేయాలన్నా సరే అనుమతి తప్పని సరి. కోడ్ అమల్లో ఉండగా ఎలాంటి అనుమతి లభించదు. పోనీ పార్టీ జెండాలు లేకుండా ధర్నాలు చేస్తే.. దాని వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదు. జెండా పట్టుకుంటేనే నేతలకు, కార్యకర్తలకు గుర్తింపు. అలా లేకుండా చేస్తే… ఎలాంటి ప్రయోజనం ఉండదనేది పార్టీ నేతల మాట. ఈ నేపథ్యంలో ఫీజు పోరు వాయిదా వేద్దామనేది కొందరు నేతల అభిప్రాయం. అయితే ఇప్పటికే నాలుగు సార్లు వాయిదా పడటంతో… మరోసారి కూడా ఇలాగే వాయిదా వేస్తే… విద్యార్థుల్లో, తల్లిదండ్రుల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయనేది మరికొందరి మాట. ఇప్పుడు వాయిదా వేసి… కోడ్ ముగిసిన తర్వాత మార్చి నెలలో నిర్వహించాలనేది కొందరి మాట. అయితే మార్చి నెలలో ఇంటర్, టెన్త్ పరీక్షలు ఉన్నాయి కాబట్టి… ఆ సమయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొనే అవకాశం లేదంటున్నారు. దీంతో ఫీజు పోరు విషయంలో కనీస అవగాహన లేకుండా ఎలా నిర్ణయం తీసుకున్నారని అధినేతపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.