అంగన్ వాడీలు, ఆశావర్కర్లు, వీఏవోలతో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ధర్నాలు చేయాల్సిన అవసరం లేదని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అంగన్ వాడీల విషయంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. దీనిపై మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ.. వైసీపీ తీరును తప్పుబట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ రోజు ప్రతిపక్ష సభ్యులు వెనుక తలుపు నుంచి వాకౌట్ చేస్తున్నారు. మొన్న ముందు తలుపు నుంచి వాకౌట్ చేశారు. వారు వాకౌట్ చేయాల్సిన పనిలేదు. వినేందుకు సభ్యులకు ఓపిక ఉండాలి. ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ అని ప్రతిపక్ష నేత బొత్స అన్నారు.
Also Read : మరో దేశంపై ట్రంప్ గురి.. యుద్ధంపై సంచలన కామెంట్స్..!
అమరావతి పనులు ఎందుకు నిలిపివేశారు? అన్న క్యాంటీన్లను ఎందుకు మూసేశారు? అన్ని సంఘాలతో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇది ప్రజా ప్రభుత్వం. మేం పరదాలు కట్టుకుని తిరగడం లేదు. విద్యాశాఖలో కూడా వివిధ సంఘాలను కలిసి సమస్యల పరిష్కారం కోసం కృషిచేస్తున్నాం. అంగన్ వాడీలు, ఆశావర్కర్లు, వీఏవోలతో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ధర్నాలు అసలు చేయాల్సిన అవసరం లేదు. మొన్న అంగన్ వాడీలకు సాయంత్రం 6 గంటల వరకు పర్మిషన్ ఇచ్చారు. వారు మధ్యాహ్న భోజనం కూడా అన్న క్యాంటీన్లలో చేశారు. మంచినీరు కూడా అందించాం. అంబులెన్స్ లు కూడా అందుబాటులో ఉంచాం.
Also Read : మోడీ కేబినేట్ లో వింతలు ఇవే..!
సాయంత్రం తర్వాత అనుమతి లేకుండా ఉండటంతో అందరం కంగారు పడ్డాం. వారి రక్షణ దృష్ట్యా బతిమిలాడి మహిళా కానిస్టేబుల్స్ తో తీసుకెళ్లడం జరిగింది. మేం ఎవరినీ అరెస్ట్ చేయలేదు. ఎవరిపైనా కేసులు పెట్టాల్సిన అవసరం లేదు. వారితో చర్చించే మేం పనిచేస్తాం. వారిని పిలుస్తాం, మాట్లాడతాం. వేతనాల పెంపు పరిశీలనలో ఉందని మంత్రి చెప్పారు. గౌరవ సీఎం గారు కూడా నిర్ణయం తీసుకుంటారని అంగన్ వాడీలకు తెలియజేస్తున్నా. ఆశావర్కర్లు, వీఏవోలకు కూడా ప్రభుత్వం తరపున హామీ ఇస్తున్నానని మంత్రి తెలిపారు.

