తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ రక్షణ సేన.. టీఆర్ఎస్ చీఫ్ కవిత. తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు తిరిగి భారత రాష్ట్ర సమితి.. బీఆర్ఎస్లో చేరే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తాను మళ్లీ బీఆర్ఎస్లోకి వెళ్తానంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని, ఉద్దేశపూర్వకంగా కొందరు ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తన రాజకీయ భవిష్యత్తుపై జరుగుతున్న ప్రచారాన్ని కవిత తీవ్రంగా ఖండించారు. టీఆర్ఎస్ అనే పేరును తనకు దక్కకుండా చేయడానికి కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
Also Read : వెలగపూడికి చెక్ పెడుతున్నారా..?
ఇదే సమయంలో తన అన్న కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న బీఆర్ఎస్ పై కవిత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ పార్టీలో విలువలు, సిద్ధాంతాలు, క్రమశిక్షణ పూర్తిగా కనుమరుగయ్యాయని ఆరోపించారు. ఒక రాజకీయ పార్టీకి ఉండాల్సిన నీతి, నియమాలు, బాధ్యతాయుతమైన వ్యవహారశైలి బీఆర్ఎస్లో ఇప్పుడు కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. సామాజిక మాధ్యమాల్లో బీఆర్ఎస్కు చెందిన కొందరు నాయకులు, కార్యకర్తలు వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారని కవిత ఆరోపించారు. మహిళల పట్ల కనీస గౌరవం కూడా లేకుండా తల్లి, చెల్లి అనే సభ్యతను మరిచి అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి రాజకీయ సంస్కృతిని ప్రజలు గమనిస్తున్నారని, వ్యక్తిత్వ హననమే లక్ష్యంగా సోషల్ మీడియాను ఉపయోగించడం బాధాకరమని అన్నారు.
Also Read : అగ్రిగోల్డ్.. బాధితుల కోసం మెగా రోడ్ మ్యాప్..!
భారత రాష్ట్ర సమితి అధికారిక బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.1400 కోట్ల ఫిక్సిడ్ డిపాజిట్లపై కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. సింగరేణి బాయి బాట కార్యక్రమంలో భాగంగా కొత్తగూడెంలోని పీవీకే 5 భూగర్భ గనిలోకి వెళ్లి కార్మికులతో మాట్లాడారు. భారత్ రాష్ట్ర సమితి ఖాతాలో మూలుగుతున్న రూ.1400 కోట్ల నిధులు సక్రమంగా, పారదర్శకంగా వచ్చినవి కావన్నారు. పది సంవత్సరాల గులాబీ పాలనలో క్విడ్ ప్రో కో పద్ధతిని అవలంబించి.. ఏపీకి చెందిన పలువురు పెద్ద కాంట్రాక్టర్ల నుంచి వసూలు చేసిన అక్రమ సొమ్ముగా ఆరోపించారు. తెలంగాణ వనరులను, సాగునీటి ప్రాజెక్టులను పొరుగు రాష్ట్ర కాంట్రాక్టర్లకు అప్పనంగా కట్టబెట్టి.. దానికి ప్రతిఫలంగా ఈ భారీ మొత్తాన్ని పార్టీ ఫండ్గా మళ్ళించారని.. ఇందులో కేటీఆర్, హరీష్ రావుల పాత్ర ఉందని కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ మొత్తం సొమ్మును తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల కుటుంబాలకు పంచి పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కామెంట్స్ ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో దుమారం రేపుతున్నాయి.

