వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్జి చాలా కాలానికి ఆ ప్రాంతానికి వెళ్తున్నారు. రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసే సత్తా కలిగిన ప్రాంతం అది. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమికి మొత్తానికి మొత్తం సీట్లు పట్టం కట్టి వైసీపీకి జీరో మార్కులు వేసిన కీలక రాజకీయ స్థావరమది. రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరు అయిన గోదావరి జిల్లాల్లో తమ పర్యటనకు జగన్ శ్రీకారం చుడుతున్నారు. ఎన్నికల్లో ఓడిన తర్వాత రెండేళ్లుగా జగన్ పరామర్శలు చేస్తున్నారు. అయితే ఇవి ఎక్కువగా కృష్ణా, గుంటూరు జిల్లాలకే పరిమితం అయ్యాయి. మధ్యలో విశాఖ కూడా వచ్చారు. అయితే జగన్ తొలిసారి పశ్చిమ గోదావరి జిల్లా ప్రాంతానికి వస్తున్నారు.
Also Read : అనంతపురంలో అలజడికి తోపుదుర్తి భారీ స్కెచ్ ..!
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఈ నెల 15వ తేదీన జగన్ పర్యటించనున్నారు. ఆక్వా రైతులను పరామర్శించి వారి సాధక బాధలను వినేందుకు జగన్ వస్తున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ మధ్యనే తాడేపల్లి ప్యాలెస్కు వచ్చిన ఆక్వా రైతులు.. తమ సమస్యలను జగన్ మోహన్ రెడ్డికి తెలియజేశారు. ఆ సమయంలో వారికి అండగా ఉంటూ వైసీపీ పోరాటం చేస్తుందని జగన్ హామీ ఇచ్చారు. దానికి అనుగుణంగానే జగన్ పర్యటన భీమవరంలో పెట్టుకున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఆక్వా రైతులను టీడీపీ కూటమి ప్రభుతం రెండేళ్ల కాలంలో ఆదుకోలేదని వైసీపీ విమర్శిస్తోంది. సిండికేట్ యాజమాన్యాలు దళారులు కుమ్మక్కు అయి ఫీడ్ రేట్లు భారీగా పెంచేసినా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆక్వా రైతులు ఆందోళనలో ఉన్నారని వైసీపీ నేతలు అంటున్నారు.
Also Read : ఫౌజీ సెట్ లో అసలేం జరిగింది..?
ఇదిలా ఉంటే ఫీడ్ రేట్లు కొంత తగ్గించినా ఇంకా ఆక్వా రైతులు ఇబ్బందుల్లోనే ఉన్నారని అంటున్నారు. ఆక్వా రైతులను ఆదుకునేందుకు వైసీపీ తరఫున కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇదిలా ఉంటే గోదావరి జిల్లాల్లో 2024 ఎన్నికల్లో వైసీపీకి ఒక్క సీటు కూడా రాలేదు. ఉమ్మడి గోదావరి జిల్లాలను కూటమి క్లీన్ స్వీప్ చేసింది. దీని ప్రభావం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఉండే ప్రమాదం ఉందని ఆ పార్టీ నేతలు భయపడుతున్నారు. ఈ క్రమంలోనే రెండేళ్ల తర్వాత జగన్ గోదావరి బాట పట్టారు. పోయిన చోటే వెతుక్కోవాలన్నట్లుగా గోదావరి జిల్లాల్లో పట్టు సాధించేందుకు జగన్ ఇప్పటి నుంచే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆక్వా రైతుల సమస్యలే ఆయుధంగా కూటమి ప్రభుత్వం మీద పోరాటం చేయాలనే ఆలోచనలో వైసీపీ ఉన్నట్లు తెలుస్తోంది. మరి వైసీపీకి గోదావరి పల్స్ ఏ విధంగా చిక్కుతుందో వేచి చూడాల్సి ఉంది.

