ప్రధానమంత్రి నరేంద్ర మోదీని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన, మార్ఫింగ్ వీడియోలను సర్క్యులేట్ చేసిన వ్యవహారంలో సైబర్ క్రైమ్ పోలీసులు సంచలన చర్యలు చేపట్టారు. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన నీట్ పేపర్ లీక్ నిరసనల సమయంలో ప్రధాని మోదీకి సంబంధించిన కొన్ని అసభ్యకరమైన వీడియోలు, చిత్రాలను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లలో విస్తృతంగా షేర్ చేశారు. దీనిపై స్పందించిన సైబర్ క్రైమ్ విభాగం.. ఆయా సోషల్ మీడియా ఖాతాల నిర్వాహకులతో పాటు ప్రముఖ సామాజిక మాధ్యమ దిగ్గజ సంస్థ మెటా ఇండియా హెడ్ పై కూడా కేసులు నమోదు చేసింది.
Also Read : భోగాపురం.. మూడు రాష్ట్రాల పవర్ హౌస్
ఈ ఉదంతంపై బీజేపి మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా కోర్ కమిటీ సభ్యుడు టి. సాయికిరణ్ గౌడ్ దాదాపు 20 ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లింకులను పోలీసులకు సమర్పించి, మెటా సంస్థపై చర్యలు తీసుకోవాలని కోరారు. మరో ఫిర్యాదులో ప్రధాని మోదీతో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మాజీ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లను కించపరిచేలా మార్ఫింగ్ చేసిన అశ్లీల చిత్రాలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు.
Also Read : కృష్ణా డెల్టాకు గోదారమ్మ గుడ్ న్యూస్..!
ఈ ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు భారతీయ న్యాయ సంహిత, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని పలు కఠినమైన సెక్షన్ల కింద రెండు వేర్వేరు కేసులు నమోదు చేశారు. సదరు అభ్యంతరకర కంటెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలను అందజేయాలని కోరుతూ మెటా సంస్థకు సైబర్ క్రైమ్ అధికారులు ఇప్పటికే అధికారిక నోటీసులు జారీ చేశారు. కాగా, గురువారం సాయంత్రానికి సదరు వివాదాస్పద లింకులు ఇన్యాక్టివ్ గా మారినట్లు పోలీసులు గుర్తించారు. అయినప్పటికీ, ఆ అకౌంట్ల వెనుక ఉన్న అసలైన సూత్రధారులను సాంకేతిక ఆధారాల ద్వారా ట్రాక్ చేసే పనిలో దర్యాప్తు బృందాలు నిమగ్నమయ్యాయి.

