అమరావతి పరిధిలో ఇటీవల వైసీపీ నేతల పర్యటన సందర్భంగా.. జరిగిన ఉద్రిక్తతలు, ఘర్షణల వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ దాడికి సంబంధించిన విజువల్స్ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులకు కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ ఘర్షణల్లో వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ప్రధాన అనుచరుడు నూనె ఉమామహేశ్వరరెడ్డి ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు పోలీసులు తాజాగా గుర్తించారు. తన అనుచరులు, వైసీపీ శ్రేణులను పెద్ద ఎత్తున సమీకరించి, పక్కా ప్రణాళికతోనే ఉమామహేశ్వరరెడ్డి ఘర్షణ ప్రాంతానికి చేరుకున్నట్లు నిర్ధారణ అయింది.
Also Read : తిరుపతిలో భూమన దారుణాలు.. అడ్డంగా దొరికారా..?
నూనె ఉమామహేశ్వరరెడ్డికి పాత నేర చరిత్ర కూడా ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. గతంలో మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసులోనూ ఈయన అత్యంత కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. ఆనాడు టీడీపీ ఆఫీసుపై దాడి చేయడానికి వచ్చిన అల్లరి మూకలకు, గూండాలకు ప్రత్యేకంగా వాహనాలు ఏర్పాటు చేసి, వెనకుండి నడిపించింది ఉమామహేశ్వరరెడ్డేనని పోలీసులు గుర్తించారు. ఇప్పుడు మళ్లీ అదే తరహాలో అమరావతిలో ఘర్షణ వాతావరణం సృష్టించడానికి తన బలగంతో రంగంలోకి దిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
Also Read : అయోధ్య కేసు.. దొంగలు మహా ఘనులు..!
మరోవైపు ఈ ఘర్షణలకు సంబంధించి పోలీసులు ఇప్పటికే పలువురు వైసీపీ నేతలను గుర్తించి చట్టపరమైన చర్యలు ప్రారంభించారు. అందులో భాగంగానే వైసీపీ కీలక నేత పానుగంటి చైతన్యను కూడా పోలీసులు ఇప్పటికే ఐడెంటిఫై చేశారు. అమరావతి రైతులు, స్థానికుల ముసుగులో వచ్చి శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన ప్రతీ ఒక్కరినీ వదిలిపెట్టేది లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ కేసులో నూనె ఉమామహేశ్వరరెడ్డితో పాటు మిగిలిన నిందితుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

