రాష్ట్రంలో అర్హులైన పేదలకు సామాజిక భద్రత పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం మరోసారి కొత్త దరఖాస్తులను స్వీకరించనుంది. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, కార్మికులు, ఇతర బలహీన వర్గాలకు కొత్తగా పింఛన్ పొందే అవకాశం కల్పించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 62 లక్షల మంది ప్రతి నెలా పింఛన్ పొందుతున్నారు. అర్హత ఉన్నప్పటికీ వివిధ కారణాలతో ఇప్పటివరకు పింఛన్ అందని వారు ఇప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చు.
Also Read : ‘దాదా’గా వస్తున్న బాలయ్య.. పోలీస్ స్టేషన్లోనే పవర్ఫుల్ వార్నింగ్!
సెప్టెంబర్ 7 నుంచి దరఖాస్తుల స్వీకరణ
కొత్త పింఛన్ల కోసం సెప్టెంబర్ 7 నుంచి 16వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అర్హులైన వారు తమ పరిధిలోని స్వర్ణ గ్రామం లేదా స్వర్ణ వార్డు కేంద్రానికి వెళ్లి దరఖాస్తు సమర్పించాలి. అక్కడ నిర్ణీత నమూనాలో దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంటాయి. అవసరమైన వివరాలను నమోదు చేసి, సంబంధిత ధృవపత్రాలను జతచేసి దరఖాస్తు ఇవ్వాలి. దరఖాస్తును ఆన్లైన్లో నమోదు చేసి, ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేస్తారు. అనంతరం దరఖాస్తుదారుడికి సిస్టమ్ ద్వారా రూపొందించిన అక్నాలెడ్జ్మెంట్ అందజేస్తారు.
Also Read : గుహలోంచి బయటకొచ్చిన కూన.. సింహంగా అడుగుపెడుతున్న మోక్షజ్ఞ!
దరఖాస్తుల పరిశీలనకు స్పష్టమైన గడువు
కొత్త పింఛన్ దరఖాస్తులను వేగంగా, పారదర్శకంగా పరిశీలించేందుకు ప్రభుత్వం ప్రతి దశకు గడువు నిర్ణయించింది.
- సెప్టెంబర్ 7 నుంచి 16 వరకు: దరఖాస్తుల స్వీకరణ, ఆన్లైన్ నమోదు, ఈ-కేవైసీ ధృవీకరణ.
- సెప్టెంబర్ 17 నుంచి 21 వరకు: దరఖాస్తుదారుల సాధారణ అర్హతల పరిశీలన.
- సెప్టెంబర్ 22 నుంచి 24 వరకు: భౌతిక పరిశీలన, సంబంధిత శాఖల ధృవీకరణ, అర్హత నిర్ణయం, సిఫారసు.
- సెప్టెంబర్ 25, 26 తేదీల్లో: సెర్ప్ ద్వారా బడ్జెట్ ప్రతిపాదనల తయారీ, ప్రభుత్వ ఆమోద ప్రక్రియ.
అన్ని దశల్లో పరిశీలన పూర్తయిన తరువాత అర్హులైన వారికి విడతల వారీగా కొత్త పింఛన్లు మంజూరు చేస్తారు. అన్ని రకాల పింఛన్లకు సాధారణంగా ఆధార్ కార్డు, రైస్ కార్డు లేదా ఆదాయ ధృవపత్రం అవసరం. వీటితోపాటు దరఖాస్తు చేసుకునే పింఛన్ కేటగిరీకి సంబంధించిన ప్రత్యేక ధృవపత్రాలను కూడా సమర్పించాలి.
Also Read : అయ్యన్న పాత్రుడి అలుపెరుగని రాజకీయ ప్రస్థానం
కేటగిరీల వారీగా అవసరమైన పత్రాలు
- వృద్ధాప్య పింఛన్: వయస్సు నిర్ధారణ కోసం ఆధార్ కార్డు.
- వితంతు పింఛన్: భర్త మరణ ధృవపత్రం, భర్త ఆధార్ నంబర్.
- ఒంటరి మహిళ పింఛన్: వివాహిత అయితే కోర్టు లేదా అదాలత్ జారీ చేసిన విడాకుల డిక్రీ. అవివాహిత అయితే తహసీల్దార్ జారీ చేసిన అవివాహిత ధృవపత్రం.
- దివ్యాంగుల పింఛన్: 40 శాతం లేదా అంతకంటే ఎక్కువ దివ్యాంగత్వం ఉన్నట్లు నిర్ధారించే సదరం (SADAREM) ధృవపత్రం.
- చేనేత కార్మికుల పింఛన్: చేనేత, జౌళి శాఖ ధృవపత్రం.
- మత్స్యకారుల పింఛన్: మత్స్య శాఖ ధృవపత్రం.
- డప్పు కళాకారుల పింఛన్: సాంఘిక సంక్షేమ శాఖ ధృవపత్రం.
- సంప్రదాయ చెప్పుల తయారీదారుల పింఛన్: సాంఘిక సంక్షేమ శాఖ ధృవపత్రం.
- కల్లుగీత కార్మికుల పింఛన్: నిషేధ, ఎక్సైజ్ శాఖ ధృవపత్రం.
- ట్రాన్స్జెండర్ పింఛన్: జిల్లా వైద్య మండలి జారీ చేసిన ధృవపత్రం.
ప్రస్తుతం ఎంతమందికి పింఛన్ అందుతోంది?
ప్రస్తుతం రాష్ట్రంలో 61,92,396 మంది పింఛనుదారులకు ప్రతి నెలా సుమారు రూ.2,694 కోట్లు అందిస్తున్నారు. రాష్ట్ర జనాభాలో దాదాపు 12.88 శాతం మంది సామాజిక భద్రత పింఛన్ల ద్వారా ప్రయోజనం పొందుతున్నారు. వృద్ధులు, వితంతువులకు నెలకు రూ.4,000 చొప్పున పింఛన్ అందుతోంది. దివ్యాంగులకు రూ.6,000, తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కొన్ని వర్గాలకు రూ.10,000, పూర్తిస్థాయి దివ్యాంగులకు రూ.15,000 వరకు పింఛన్ ఇస్తున్నారు.
ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 2026 సెప్టెంబర్ 1వ తేదీ వరకు పింఛన్ల కోసం రూ.73,508 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. అర్హత ఉండి ఇప్పటివరకు పింఛన్ పొందని వారు సెప్టెంబర్ 7 నుంచి 16వ తేదీలోపు అవసరమైన పత్రాలతో తమ స్వర్ణ గ్రామం లేదా స్వర్ణ వార్డు కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలి.

