తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా మునుపెన్నడూ లేని విధంగా అత్యంత నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గులాబీ దళపతి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అరెస్ట్ కాబోతున్నారా..? అనే అనుమానాలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్హౌస్ను మంగళవారం వందలాది మంది పోలీసులు అకస్మాత్తుగా చుట్టుముట్టడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎలాంటి ముందస్తు సమాచారం కానీ, నోటీసులు కానీ ఇవ్వకుండా భారీ సంఖ్యలో పోలీస్ బలగాలు ఫామ్హౌస్ వద్దకు చేరుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Also Read : దులీప్ ట్రోఫీ ఫైనల్లో సరికొత్త చరిత్ర.. సెలెక్టర్లకు గట్టి సిగ్నల్..!
అసలు పోలీసులు ఎందుకు వచ్చారు? లోపల ఏం జరగబోతోంది? అనే విషయాలపై పోలీసులు నోరు విప్పకపోవడంతో ఉత్కంఠ మరింత రెట్టింపయింది. కేసీఆర్ అరెస్ట్ వార్తలు కార్చిచ్చులా వ్యాపించడంతో ఉలిక్కిపడిన బీఆర్ఎస్ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు మరియు భారీగా కార్యకర్తలు ఫామ్హౌస్ వైపు పరుగులు తీస్తున్నారు. మరోవైపు హైదరాబాద్లోని ప్రధాన బీఆర్ఎస్ నేతల నివాసాలు మరియు ఫామ్హౌస్ పరిసర ప్రాంతాలలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి ఎవరినీ లోపలికి అనుమతించడం లేదు.
Also Read : విజయసాయి కొత్త ‘దారి’ జగన్ కి బీ-టీంగా మారుతుందా?
ఈ పరిణామాలు చూస్తుంటే కేసీఆర్ను టార్గెట్ చేస్తూ ప్రభుత్వం పెద్ద స్కెచ్ వేసిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోపక్క రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అరెస్టుల పర్వం కలకలం రేపుతోంది. నిన్న అసెంబ్లీ వర్షాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా అసెంబ్లీ గేట్ల వద్ద బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున ధర్నాకు దిగిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వంపై నల్ల చొక్కాలతో నిరసన తెలిపేందుకు ప్రయత్నించిన కేటీఆర్, హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి సహా పలువురు ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకుని, ఈడ్చుకెళ్లి అరెస్ట్ చేశారు. ఆ ఉదంతంపై పోలీసులపై దాడి చేశారంటూ కేటీఆర్, హరీష్ రావు సహా పలువురు నేతలపై పోలీసులు కేసులు నమోదు చేయగా, ఈరోజు ఉదయమే ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వరుస పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ ఫామ్హౌస్ వద్ద పోలీసుల మోహరింపు తెలంగాణ రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించింది.

