తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త రణం మొదలైంది. ఇన్నాళ్లూ కేవలం సినిమాల్లోనే డీఎంకే, ఏఐఏడీఎంకే వంటి ద్రావిడ పార్టీలపై పంచ్లు వేసిన సిఎం విజయ్, ఇప్పుడు నేరుగా అధికార పీఠంపై కూర్చుని విపక్ష డీఎంకే.. మైండ్ బ్లాక్ అయ్యేలా.. రాజకీయ వ్యూహాలు అమలు చేస్తున్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయంతో తమిళగ వెట్రి కళగం పార్టీని అధికారంలోకి తెచ్చి, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్.. ఇప్పుడు అవినీతి అంతమే లక్ష్యంగా డీఎంకే టాప్ లీడర్లను టార్గెట్ చేసినట్లు స్పష్టమవుతోంది.
Also Read : కృష్ణా జలాల పంచాయతీ.. అసలు వాటా ఎంత..?
ఈ క్రమంలోనే డీఎంకే సీనియర్ నేత, మాజీ మంత్రి కేఎన్ నెహ్రూ నివాసాలు, కార్యాలయాలపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేయడం రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. శనివారం తెల్లవారుజాము నుంచే చెన్నై, తిరుచ్చితో పాటు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 19 ప్రాంతాల్లో ఏసీబీ బృందాలు ఏకకాలంలో సోదాలు ప్రారంభించాయి. కేఎన్ నెహ్రూ గత డీఎంకే ప్రభుత్వంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా ఉన్న సమయంలో.. ప్రభుత్వ ఉద్యోగాల ఆశ చూపి సుమారు రూ. 1,000 కోట్ల మేర వసూళ్లకు పాల్పడ్డారనే బలమైన ఆరోపణలు ఉన్నాయి.
Also Read : బిగ్ బాస్ 10 ఫైనల్ లిస్ట్ ఇదే..!
దాంతో పాటు పార్టీ ఫండ్స్ పేరుతో కార్పొరేట్ కంపెనీలను బెదిరించి అక్రమ ఆస్తులు కూడబెట్టారనే ఫిర్యాదులపై సీఎం విజయ్ సర్కార్ పూర్తిస్థాయిలో దృష్టి సారించింది. గతంలో డీఎంకే హయాంలో ఇష్టారాజ్యంగా సాగిన వ్యవహారాలన్నింటికీ తాజా టీవీకే ప్రభుత్వం పక్కా ఆధారాలతో చెక్ పెడుతున్నట్లు కనిపిస్తోంది. ఈ సోదాలపై డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ మండిపడ్డారు. ఇదంతా పూర్తిగా రాజకీయ కక్షసాధింపు చర్యేనని మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తరుణంలో, కోర్టులో కేసు పెండింగ్లో ఉండగా కావాలనే తమ పార్టీ ముఖ్య నేతలను మానసికంగా దెబ్బతీయడానికే విజయ్ ప్రభుత్వం ఈ సోదాలు చేయిస్తోందని ఆరోపించారు.

