తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా సాగుతున్న ఉత్కంఠ వాతావరణానికి రాఖీ పండుగ వేళ కాస్త ఊరట లభించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ కుమార్తె చేసిన కొన్ని వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారాన్నే లేపాయి. ఈ వివాదంతో కాస్త ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్న మంత్రి సురేఖ.. గత మూడు నాలుగు రోజులుగా వరంగల్కే పరిమితమయ్యారు. అయితే, రేవంత్ రెడ్డితో నెలకొన్న ఈ గంభీరమైన వాతావరణానికి రాఖీ పండుగ ఒక చక్కని పరిష్కార వేదికగా మారిందని చెప్పవచ్చు.
Also Read : గుండెపోటు ముప్పును ముందే గుర్తించే టెస్ట్..!
రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని మంత్రి కొండా సురేఖ ప్రత్యేకంగా హైదరాబాద్ తరలివచ్చారు. మరో మంత్రి సీతక్కతో కలిసి నేరుగా ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లిన ఆమె.. సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఇద్దరి ముఖాల్లోనూ చిరునవ్వులు కనిపించడం విశేషం. ముఖ్యమంత్రితో పాటు ఆయన అల్లుడికి, మనవడికి కూడా సురేఖ రాఖీలు కట్టారు. సీఎం రేవంత్ రెడ్డి కోసం ఈసారి ఆమె ప్రత్యేకంగా చేయించిన ఒక ‘బంగారు రాఖీ’ని తీసుకురావడం సచివాలయ, రాజకీయ వర్గాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Also Read : అమరావతిలో మళ్ళీ ల్యాండ్ పూలింగ్.. ఈసారి ఎంతంటే..!
ముఖ్యమంత్రికి రాఖీ కట్టిన అనంతరం మీడియాలో వస్తున్న ఊహాగానాలపై కొండా సురేఖ క్లారిటీ ఇచ్చారు. “నా ఆశీస్సులను, ఈ బంధాన్ని ఎవరూ వేరేలా చూడకండి. నన్ను పార్టీ నుండి లేదా సీఎం నుండి వేరు చేసి చూడాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను ఎలాంటి రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు” అని ఆమె స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డికి తాను రాఖీ కట్టడం ఇది వరుసగా మూడోసారి అని గుర్తుచేస్తూ.. ఆయన రాష్ట్ర ప్రజలకు మరింత మెరుగైన సుపరిపాలన అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. సీఎం రేవంత్కు రాష్ట్రంలోని ఆడపడుచుల దీవెనలు ఎల్లప్పుడూ ఉంటాయని సురేఖ పేర్కొన్నారు.

