ఒంగోలు రాజకీయం మరోసారి తీవ్ర రసవత్తరంగా మారింది. మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి.. ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్ను లక్ష్యంగా చేసుకుని తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు గుప్పించారు. తనను, తన అనుచరులను వేధిస్తున్నారని మండిపడిన ఆయన, ఒంగోలు అభివృద్ధి, మున్సిపల్ నిధుల గల్లంతుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒంగోలు మున్సిపాలిటీలో ఏకంగా రూ.8.5 కోట్ల నిధులు గల్లంతయ్యాయని, ఆ డబ్బులు ఎక్కడికి పోయాయో దామచర్ల జనార్థన్ సమాధానం చెప్పాలని బాలినేని డిమాండ్ చేశారు.
Also Read : విమర్శలకు చెక్ పెట్టడంలో విఫలమయ్యారా..?
తానొకవేళ జనసేనలో చేరకపోతే జైల్లో వేయించేవాడినని దామచర్ల అన్నారని, తన అనుచరులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు. “దామచర్ల మమ్మల్ని లోపల వేయిస్తే, మాకు తిరగబడటం చేతకాదా?” అని ఘాటుగా హెచ్చరించారు. ఈ వివాదంపై పారదర్శకత కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించాలని బాలినేని కోరారు. తనతో పాటు ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్పై కూడా సిఎం చంద్రబాబు సమగ్ర విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. నిజానిజాలు తేలాలంటే విచారణే సరైన మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు.
Also Read : ఏపి పోలీసుల పై మంత్రి భరత్ ఘాటు వ్యాఖ్యలు
అంతేకాకుండా, దామచర్లకు బాలినేని ఓ బహిరంగ సవాల్ విసిరారు. “నేను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నాను.. కాణిపాకం శ్రీ స్వయంభూ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో ప్రమాణం చేయడానికి నేను సిద్ధం. మరి ఈ ప్రమాణానికి జనార్థన్ సిద్ధమా?” అని ప్రశ్నించారు. అలాగే ఒంగోలు నియోజకవర్గంలో ధైర్యముంటే ఇద్దరం స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేద్దామని, ప్రజా తీర్పుకే వదిలేద్దామని సవాల్ విసిరారు. బాలినేని చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం స్థానిక రాజకీయాల్లో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి.

