వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా పర్యటన సందర్భంగా జిల్లాలో నిన్న జరిగిన ఓ సంఘటన తీవ్ర వివాదాస్పదం అయింది. విధుల్లో ఉన్న ఒక మహిళా సబ్ ఇన్స్పెక్టర్ పై వైసీపీ శ్రేణులు ప్రవర్తించిన తీరు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. వైఎస్ జగన్ కాన్వాయ్ వెళ్తున్న సమయంలో భద్రతా విధుల్లో ఉన్న మహిళా అధికారిని వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా చుట్టుముట్టారు. వారిని నిలువరించేందుకు ఆమె ప్రయత్నించగా, వారు దురుసుగా ప్రవర్తిస్తూ, బూతులు తిడుతూ, చేతులతో తోస్తూ పక్కకు నెట్టివేయడం తీవ్ర దుమారం రేపింది.
Also Read : వన్ ఆఫీసర్, వన్ కార్.. ప్రభుత్వ వాహనాలకు కేంద్రం బ్రేక్..!
ఈ ఘటనపై మంత్రి నారా లోకేష్ సాషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. “విధుల్లో ఉన్న మహిళా ఎస్సైపై వైసీపీ నేతలు ప్రవర్తించిన తీరు తీవ్ర ఆక్షేపణీయం. మహిళల భద్రత, గౌరవంతో ఎవరు చెలగాటమాడినా సహించేది లేదు. తప్పు చేసిన వైసీపీ గూండాలపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవు” అని ఆయన స్పష్టం చేసారు. మహిళలను అవమానించడం, వారిపై దౌర్జన్యం చేసి రాక్షస ఆనందం పొందడం వైసీపీ డీఎన్ఏలోనే ఉందంటూ లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : ఏపీలో పోలీసు వ్యవస్థ పని చేస్తుందా..?
రాజకీయం కోసం సొంత తల్లిని, చెల్లిని రాష్ట్రం దాటించి గెంటేసిన చరిత్ర జగన్ రెడ్డిది అంటూ ఆయన ఘాటుగా విమర్శలు గుప్పించారు. ఈ అరాచక ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కూటమి ప్రభుత్వం మరియు పోలీస్ యంత్రాంగం దీనిపై సీరియస్ అయ్యాయి. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ, ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ అని కూడా చూడకుండా కీచక పర్వానికి ఒడిగట్టిన వారిని గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. బాధ్యులపై ఇప్పటికే పలు సెక్షన్ల కింద కేసులు నమోదు కాగా, నిందితులను కఠినంగా శిక్షించాల్సిందేనని ప్రజా సంఘాలు మరియు తోటి పోలీస్ అధికారులు డిమాండ్ చేస్తున్నారు.

