తమిళనాడులోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఒక భారీ సర్ప్రైజ్ ఇవ్వబోతోంది. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు వారానికి ఒకసారి రుచికరమైన చికెన్ బిర్యానీ వడ్డించాలనే ఒక సరికొత్త ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మంత్రి రాజ్మోహన్.. ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ కి ఒక ప్రత్యేక నివేదికను సమర్పించారు. తమిళనాడులో స్కూల్ విద్యార్థుల పోషకాహార కార్యక్రమాలకు ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉందని మంత్రి రాజ్ మోహన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
Also Read : ఏపీలో ఐషర్ మోటార్స్ ఎంట్రీ.. భారీ పెట్టుబడి..!
గతంలో మాజీ సీఎం కామరాజర్ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభిస్తే, ఆ తర్వాత వచ్చిన కరుణానిధి ఆ మెనూకు గుడ్లను జోడించారని చెప్పారు. ఆ తర్వాత ఎంజీఆర్ దానిని మరింత పౌష్టికాహారంగా మార్చగా, జయలలిత వారం మొత్తం గుడ్లు పంపిణీ చేసేలా విస్తరించారని వివరించారు. అదే విధంగా తమ ప్రభుత్వ హయాంలో వారానికి ఒకసారి ప్రభుత్వ పాఠశాలల్లో చికెన్ బిర్యానీని ప్రవేశపెట్టాలనేది తన కోరికని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ఈ ప్రతిపాదన ముఖ్యమంత్రి విజయ్ పరిశీలనలో ఉందన్నారు.
Also Read : లిఫ్ట్ ప్రమాదాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!
దీనిపై ప్రభుత్వం త్వరలోనే తుది నిర్ణయం తీసుకోబోతోందని అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ ప్రతిపాదనకు గనుక సీఎం ఆమోదం లభిస్తే.. పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచడానికి మరియు వారిలో పోషకాహార లోపాన్ని నివారించడానికి ఇది ఒక చారిత్రాత్మకమైన మైలురాయిగా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. బిర్యానీ ప్రతిపాదనతో పాటు ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలల్లో అందిస్తున్న ఉదయం బ్రేక్ ఫాస్ట్ మెనూను కూడా పూర్తిగా మార్చాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం ఒక్కో విద్యార్థికి కేటాయిస్తున్న రూ. 15 బడ్జెట్ను పునఃసమీక్షిస్తూ, ప్రతిరోజూ ఒకేలా వచ్చే గోధుమ లేదా రవ్వ ఉప్మా వంటి బోరింగ్ ఐటమ్స్ స్థానంలో పిల్లలు ఇష్టపడే మరింత రుచికరమైన, పోషక విలువలు గల ఆహారాన్ని అందించేందుకు విద్యాశాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

