వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యామిలీ చిక్కుల్లో పడింది. ఇప్పటికే రాజకీయపరంగా అనేక వివాదాల్లో ఇరుక్కున్న జోగి రమేష్కు ఊహించని షాక్ తగిలింది. జోగి రమేష్తో పాటు ఆయన సోదరుడు జోగి రాము కుటుంబానికి చెందిన మొత్తం 11 మంది సభ్యులపై గృహహింస, వరకట్న వేధింపులతో పాటు తీవ్రస్థాయి ఆరోపణల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. NTR జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు కావడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.
Also Read : అన్నదాతలకు ఏపీ ప్రభుత్వం అలర్ట్.. ఆ పంట ఆపండి..!
జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ భార్య మేఘన పోలీసులను ఆశ్రయించి ఈ ఫిర్యాదు చేశారు. పెళ్లయిన నాటి నుంచే అదనపు కట్నం తెవాలంటూ తనను తీవ్ర మానసిక, భౌతిక వేధింపులకు గురిచేస్తున్నారని ఆమె తీవ్రస్థాయిలో ఆరోపించారు. కుటుంబ పెద్దగా ఉన్న మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన భార్య ప్రోత్సాహంతోనే ఈ వేధింపులన్నీ సాగాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. గృహహింస, వరకట్న వేధింపులు, చీటింగ్తో పాటు హత్యాయత్నం వంటి తీవ్రమైన ఆరోపణల కింద జోగి కుటుంబంలోని 11 మంది పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చారు.
బాధితురాలి ఫిర్యాదును స్వీకరించిన ఇబ్రహీంపట్నం పోలీసులు BNS చట్టంలోని కఠిన సెక్షన్లతో పాటు వరకట్న నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా విచారణాధికారులు ఇప్పటికే బాధితురాలి నుంచి ప్రాథమిక స్టేట్మెంట్ను సేకరించారు. ఫిర్యాదులో పేర్కొన్న తీవ్రమైన అంశాలకు సంబంధించిన సాక్ష్యాధారాలు, వైద్య నివేదికలను సేకరించే పనిలో పోలీసులు ప్రస్తుతం నిమగ్నమయ్యారు.
Also Read : రామాయణ ట్రైలర్ ఏమైంది..? హాలీవుడ్ రేంజ్ కోసమే ఆపారా..?
ఈ కేసులో ఆరోపణల తీవ్రతను బట్టి పోలీసులు తదుపరి చట్టపరమైన కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు. నిందితులుగా ఉన్న మాజీ మంత్రి జోగి రమేష్తో సహా 11 మందికి త్వరలోనే నిబంధనల ప్రకారం విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేయనున్నట్లు సమాచారం. సొంతింటి నుంచే ఎదురైన ఈ సంచలన గృహహింస కేసు జోగి రమేష్ కుటుంబానికి చట్టపరంగా మరో భారీ సవాలుగా మారింది.

