ప్రస్తుతం యూరప్ దేశాలను రికార్డు స్థాయి ఎండలు చుక్కలు చూపిస్తున్నాయి. ముఖ్యంగా బ్రిటన్ లో ఎండ తీవ్రతకు అక్కడి తారు రోడ్లు మెత్తబడి, కరిగిపోతుండటం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. అయితే, ఇదే సమయంలో భారత్ లో ప్రతి ఏటా ఎండలు 45 డిగ్రీలు దాటినా కూడా ఇక్కడి రోడ్లు ఎందుకు కరిగిపోవు..? అనే ఆసక్తికరమైన చర్చ మొదలైంది. దీనికి కారణం రోడ్లు నిర్మించే నాణ్యత తక్కువ ఉండటం కాదు.. ఆయా దేశాల శీతోష్ణస్థితులకు అనుగుణంగా వాడే మెటీరియల్స్ లో ఉండే తేడాయే.
Also Read : రిజిస్టర్ మ్యారేజ్ చెల్లదు: హైకోర్ట్ సంచలన తీర్పు
యూకే వంటి యూరప్ దేశాలలో సాధారణంగా చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. అక్కడ రోడ్లు మంచు కురిసే చలికాలంలో గడ్డకట్టడం, మళ్లీ కరగడం వంటి ప్రక్రియలను తట్టుకోవాల్సి ఉంటుంది. అందుకోసం వారు రోడ్డు నిర్మాణంలో హాట్ రోల్డ్ తారు, సాగే గుణం ఎక్కువగా ఉండే మెత్తటి రకం బిటుమెన్ ను ఉపయోగిస్తారు. ఇది చలికాలంలో రోడ్లు పగలకుండా కాపాడుతుంది. కానీ, ఎండలు ఒక్కసారిగా 40 డిగ్రీలు దాటినప్పుడు ఆ సాగే గుణమే శాపంగా మారి, భారీ వాహనాల ఒత్తిడికి రోడ్లు మెత్తబడి పాడవుతున్నాయి.
Also Read : నేను అక్కడ నుంచి పోటీ చేయను.. లారెన్స్ క్లారిటీ..!
భారత్ లో వాతావరణం దీనికి పూర్తిగా భిన్నం. ఇక్కడ చలికాలం కంటే నెలల తరబడి సాగే ముదురు ఎండలు, తీవ్రమైన వేడిని రోడ్లు తట్టుకోవాల్సి ఉంటుంది. అందుకే భారత రోడ్ల నిర్మాణంలో అత్యధిక జిగురు, గట్టిదనం కలిగిన వీజీ-30 మరియు వీజీ-40 గ్రేడ్ బిటుమెన్ ను ఉపయోగిస్తారు. దీంతో పాటు పెద్ద పరిమాణంలో ఉండే రాళ్లను కలపడం వల్ల ఎంతటి ఎండనైనా తట్టుకుని రోడ్లు స్థిరంగా ఉంటాయి. బ్రిటన్ రోడ్లకు చలికాలం ముఖ్యం అయితే, మన దేశంలో ఎండలను తట్టుకోవడమే మొదటి ప్రాధాన్యత. అందుకే అక్కడ కరిగే ఎండలు కూడా మన రోడ్లను ఏమీ చేయలేవు.

