పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో ప్రజాస్వామ్య విలువలు, నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు తమిళనాడు ప్రభుత్వం ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో జులై నెలలో అధికారికంగా విద్యార్థి ఎన్నికలను నిర్వహించబోతున్నారు. విద్యాశాఖ ప్రవేశపెట్టిన మగిజ ముట్రమ్ అనే ప్రత్యేక హౌస్ సిస్టమ్ కింద ఈ ఎన్నికలు జరగనున్నాయి. చిన్న వయసులోనే ప్రజాస్వామ్య పునాదులను, ఎన్నికల ప్రక్రియను మరియు బాధ్యతాయుతమైన పాలనా వ్యవస్థను విద్యార్థులకు ప్రాక్టికల్గా పరిచయం చేయడమే ఈ చారిత్రాత్మక కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం.
Also Read : తమిళ రాజకీయాల్లో సంచలనం.. ప్రభుత్వం కూల్చే కుట్ర భగ్నం..!
ఈ ఎన్నికల షెడ్యూల్ పక్కా రియల్ పొలిటికల్ ఎలక్షన్స్ ను తలపిస్తోంది. ప్రతి పాఠశాలలో విద్యార్థులను ఐదు హౌస్ లుగా విభజించి, వాటికి హౌస్ కెప్టెన్, స్టూడెంట్ మినిస్టర్ పదవుల కోసం పోటీ నిర్వహిస్తారు. జులై 6న అభ్యర్థులు పాఠశాలల్లో అధికారికంగా ప్రచారం నిర్వహిస్తూ.. తాము గెలిస్తే స్కూల్ కోసం ఏం చేస్తామో వివరిస్తూ ఎన్నికల మేనిఫెస్టోలను ప్రకటిస్తారు. అనంతరం జులై 7న బ్యాలెట్ పేపర్ల ద్వారా విద్యార్థులంతా ఓట్లు వేసి తమ లీడర్లను ఎన్నుకుంటారు. లింగ సమానత్వాన్ని చాటేలా కో ఎడ్యుకేషన్ స్కూళ్లలో హౌస్ కెప్టెన్ అబ్బాయి అయితే, కచ్చితంగా స్టూడెంట్ మినిస్టర్ అమ్మాయి అయ్యిండాలనే క్రేజీ రూల్ కూడా పెట్టారు.
Also Read : రంగంలోకి రేవంత్ టీమ్.. రెడీ..!
ఇలా ఎన్నికల్లో గెలిచిన విద్యార్థి మంత్రులకు లాటరీ పద్ధతి ద్వారా విద్యా శాఖ, విద్యార్థుల సంక్షేమం-భద్రత, సమాచార-కమ్యూనికేషన్ల శాఖ, పర్యావరణం-వాతావరణ మార్పుల శాఖ, ఆరోగ్యం-పరిశుభ్రత శాఖ అనే ఐదు అత్యంత కీలకమైన మంత్రిత్వ శాఖలను కేటాయిస్తారు. ఈ ఐదు శాఖల ద్వారా ఆయా విద్యార్థి మంత్రులు పాఠశాల నిర్వహణ, క్రమశిక్షణ, పచ్చదనం మరియు పరిశుభ్రత బాధ్యతలను పర్యవేక్షిస్తారు. ఎన్నికైన ఈ బాలల క్యాబినెట్ లీడర్లు జులై 10వ తేదీన అధికారికంగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరిస్తారు.

