ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు చెందిన వివాదాస్పద, సీనియర్ ఐపీఎస్ అధికారి పి వి సునీల్ కుమార్ అధికారిక పదవీ విరమణ వేడుకలు విజయవాడ వేదికగా నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. విజయవాడలోని ప్రముఖ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో అంబేద్కర్ ఇండియా మిషన్ ఆధ్వర్యంలో ఈ సన్మాన సభను భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. ఈ సభకు దళిత, బహుజన సంఘాల నేతలతో పాటు పలువురు రాజకీయ, సామాజిక ప్రముఖులు హాజరుకానున్నారు.
Also Read : ఇప్పటికీ జగన్ నామస్మరణే..?
అయితే, ఈ సన్మాన సభ కేవలం రిటైర్మెంట్ వేడుకగానే కాకుండా, సునీల్ కుమార్ భవిష్యత్ రాజకీయ ప్రణాళికను ప్రకటించే వేదికగా మారబోతోందనే ప్రచారం జోరుగా సాగుతోంది. గత కొంతకాలంగా ఆయన ఒక కొత్త రాజకీయ పార్టీని స్థాపించబోతున్నారనే ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. రేపటి సభలో ఆయన తన కొత్త పార్టీ పేరు, జెండా మరియు భవిష్యత్ కార్యాచరణపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సునీల్ కుమార్ గతంలో సీఐడీ చీఫ్ గా ఉన్న సమయం నుండి అంబేద్కర్ ఇండియా మిషన్ ద్వారా దళిత, బహుజన వర్గాల్లో బలమైన పట్టు సాధించేందుకు ప్రయత్నించారు.
Also Read : ఎమ్మెల్యేలు.. వారితో తస్మాత్ జాగ్రత్త..!
ప్రస్తుత రాజకీయ సమీకరణాల నేపథ్యంలో, రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలను ఏకం చేస్తూ ఒక సరికొత్త పొలిటికల్ ఫ్రంట్ లేదా పార్టీని తీసుకురావడమే ఆయన లక్ష్యంగా కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సునీల్ కుమార్ పై పలు పాత కేసులు తిరగదోడటం, ఆయనపై చర్యలకు సిఫార్సు చేయడం వంటి పరిణామాలు జరిగాయి. ఈ నేపథ్యంలో, ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి నేరుగా అధికార పక్షాన్ని ఢీకొట్టబోతున్నారా..? లేక సామాజిక సేవా కార్యక్రమాలకే పరిమితం అవుతారా..? అనే ఉత్కంఠకు రేపటి విజయవాడ సభతో పూర్తి క్లారిటీ రానుంది.

