తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో దువ్వాడ శ్రీనివాస్ గురించి తెలియని వాళ్లు అంటూ ఎవరూ ఉండరు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడమే తప్ప.. గెలుపు అనేది తెలియని వ్యక్తి. ప్రజారాజ్యం టూ వైసీపీ వయా టీడీపీ ఆయన రాజకీయ ప్రయాణం. వైసీపీలో చేరిన నాటి నుంచి టార్గెట్ అచ్చెన్నాయుడు అన్నట్లుగానే ఆయన విమర్శలు చేశారు. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు టెక్కలి నియోజకవర్గంలో అధికారులతో సలాం కొట్టించుకున్నారు. నాటి ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు సొంత ఊరు నిమ్మడకు రౌడీలను వెంట బెట్టుకుని వెళ్లి.. అచ్చెన్న ఇంటి ముందు జీపు పై కత్తితో కూర్చుని రారా.. నీ.. అంటూ రాయలేని భాషలో బూతులతో రెచ్చిపోయాడు దువ్వాడ.
Also Read : ఎమ్మెల్యేలు.. వారితో తస్మాత్ జాగ్రత్త..!
మొన్నటి ఎన్నికల్లో దువ్వాడ ఓడిన తర్వాత ఆయన పరిస్థితి దారుణంగా తయారైంది. కుటుంబ సమస్యలు చుట్టుముట్టాయి. భార్య, ఇద్దరు కూతుళ్లు దువ్వాడపై తిరుగు బావుటా ఎగురవేశారు. అప్పుడే దివ్వెల మాధురి ఎంటర్ అయ్యారు. త్వరలో ఈ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా ప్రకటించారు. దాదాపు రెండేళ్లుగా ఈ ఇద్దరు సహజీవనం కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో దువ్వాడను సస్పెండ్ చేస్తున్నట్లు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరుతో పత్రికా ప్రకటన విడుదలైంది. నాటి నుంచి వైసీపీ కార్యక్రమాలకు దువ్వాడ దూరంగా ఉంటున్నారు. ఇదే సమయంలో దువ్వాడను పాత కేసులు చుట్టుముడుతున్నాయి.
ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో కొత్తూరు పోలీస్ స్టేషన్లో విచారణ కోసం టెక్కలి నుంచి బయలు దేరిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మార్గమధ్యలో అనూహ్యంగా కనిపించకుండా అదృశ్యమయ్యారు. టెక్కలి నుంచి బయలుదేరి రెండు గంటలు దాటినా ఆయన కొత్తూరు చేరుకోలేదు. ఆయన ఫోన్లు స్వీచాఫ్ అయినట్లుగా అభిమానులు చెబుతున్నారు. హిరమండలం పోలీస్ స్టేషన్లో జనసేన నాయకుడు ఇచ్చిన ఫిర్యాదుపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై కేసు నమోదు కాగా విచారణకు రావాలని కొత్తూరు పోలీసులకు ఆయనకి నోటీసులను గతంలో ఇచ్చారు. ఆ మేరకు కొత్తూరు సర్కిల్ కార్యాలయంలో ఆయనను పోలీసులు ఇటీవల విచారించారు.
Also Read : 350 ఎకరాలు స్వాహా.. వైసీపీ ఎమ్మెల్యే కబ్జా కహానీ
ఆ సమయంలో కొత్తూరు స్టేషన్ వద్ద దివ్వెల మాధురితో పాటు దువ్వాడ శ్రీనివాస్ అభిమానులు ఆందోళనకి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. విచారణ సమయంలో దువ్వాడ శ్రీనివాస్ పోలీసులకి సహకరించకపోవడంతో మరోసారి విచారణకు హాజరుకావాలని అప్పుడే పోలీసులు దువ్వాడకు నోటీసులిచ్చారు. ఈ క్రమంలో దువ్వాడ శ్రీనివాస్ను పోలీసులు మరోసారి విచారించనుండగా గతంలో దివ్వెల మాధురి స్టేషన్ ఎదుట బైటాయించి నిరసనలను తెలిపిన నేపధ్యంలో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఆమెను టెక్కలిలో నివాసం వద్దనే గృహనిర్భంధం చేసారు. దువ్వాడ శ్రీనివాస్ ఒక్కరే విచారణ కోసం కొత్తూరు బయలుదేరగా మార్గమద్యలో మిస్సయ్యారు. పోలీసులే రహస్య ప్రదేశానికి తరలించి ఉంటారని మాధురితో పాటు ఆయన అభిమానులు ఆరోపిస్తున్నారు. పోలీసులు మాత్రం కొత్తూరు స్టేషన్కు ఆయన రాలేదని చెబుతున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

