ఎమ్మెల్యేల పాలిట శాపంగా మారుతున్న ద్వితీయ శ్రేణి నాయకులు.. ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎంత అభివృద్ధి చేసినా, ప్రజలకు ఎంత చేరువగా ఉన్నా.. ఆయన వెన్నంటి ఉండే, బంధుమిత్రులతో పాటు ద్వితీయ శ్రేణి నాయకుల ప్రవర్తనే అంతిమంగా ప్రజాక్షేత్రంలో వారి భవితవ్యాన్ని నిర్ణయించబోతుందా..? ఇటీవల కాలంలో క్షేత్రస్థాయి నుంచి వస్తున్న పరిణామాలే ఆ విధంగా స్పష్టం చేస్తున్నాయి. ప్రజా ప్రతినిధులుగా మంచి పేరు తెచ్చుకోవాలని, చాలా మంది ఎమ్మెల్యేలు ఎంత ప్రయత్నిస్తున్నా వారి కింది స్థాయి నాయకులు, కుటుంబం సభ్యులు, బంధుమిత్రులు చేస్తున్న పనులు ఆశించిన దానికి భిన్నమైన ఫలితాలను ఇస్తున్నాయి.
Also Read : పవన్ కు సర్జరీ తప్పదు.. షాక్ ఇచ్చిన వైద్యులు..!
“క్యాడర్ ” ఓవర్ యాక్షన్ “ఎమ్మెల్యే” లకు డ్యామేజ్.. చాలా సందర్భాలలో ఎమ్మెల్యేలకు, సామాన్య ప్రజలకు మధ్య, కుటుంబం సభ్యులు, బంధుమిత్రులు,ద్వితీయ శ్రేణి నాయకులు ఒక వారధిలా కాకుండా అడ్డుగోడలా మారుతున్నారన్న విమర్శలొస్తున్నాయి. కింది స్థాయి నేతలు తమ సొంత ప్రయోజనాల కోసం ఎమ్మెల్యేల పేర్లు వాడుకోవడం, బెదిరింపులకు పాల్పడటం లేదా సెటిల్ మెంట్లకు దిగడం వల్ల నేరుగా ఎమ్మెల్యే ప్రతిష్ట దెబ్బతింటోంది. ప్రజల్లో గూడు కట్టుకుంటున్న ఈ నిశ్శబ్ద వ్యతిరేకత ఎన్నికల సమయానికి ప్రమాదకరంగా మారటం ఖాయం.
రాజకీయ నాయకులకు అత్యంత సున్నితమైన అంశం భూ వివాదాలు. పౌర సంబంధిత తగాదాలు, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ పంచాయతీల జోలికి వెళ్లకపోవడమే అత్యుత్తమ వ్యూహమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇలాంటి వివాదాల్లో ఏ వైపు నిలబడినా, ఒక వర్గానికి అన్యాయం జరిగిందనే భావన కలుగుతుంది. ఇది ప్రత్యర్థులకు ఆయుధంగా మారి, చివరకు ‘కబ్జాదారులు’ లేదా మరో “భూ”మాఫియా” అనే ముద్ర పడేలా చేస్తుంది. నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో, ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంలో ఎమ్మెల్యేలు సఫలమైనప్పటికీ.. ఈ సెటిల్ మెంట్ల వల్ల వచ్చే చెడ్డ పేరు ఆ అభివృద్ధిని మబ్బులా కమ్మేస్తుంది. సామాన్య, మధ్యతరగతికి చెందిన ఓటర్లు, అభివృద్ధి కంటే తమ చుట్టూ ఉన్న శాంతిభద్రతలు, వ్యక్తిగత భద్రతకే అత్యంత ప్రాధాన్యత ఇస్తారు.
Also Read : ఇప్పటికీ జగన్ నామస్మరణే..?
మరి ఈ సమస్యలకు పరిష్కారం ఏమిటంటే.. ఎమ్మెల్యేలు తమ అనుచరగణాన్ని నిశితంగా గమనించడం అత్యవసరం. తమ పేరు చెప్పుకుని ఎవరైనా వివాదాలలో తలదూర్చితే, ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా మాత్రమే ప్రజల్లో బలమైన, సానుకూల సందేశాన్ని పంపగలరు. భూ వ్యవహారాలకు వీలైనంత దూరంగా ఉండటమే.. ప్రస్తుత రాజకీయ వాతావరణంలో నాయకుల మనుగడకు అదే రక్ష.

