తిరుపతి నగరంలో వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మరో అవినీతి బాగోతం విజిలెన్స్ విచారణలో వెలుగుచూసింది. తిరుపతి మాస్టర్ ప్లాన్ రోడ్ల అలైన్మెంట్ లో నిబంధనలకు విరుద్ధంగా మార్పులు చేసి, భూములు కోల్పోయే పెద్దలకు అనుకూలంగా వ్యవహరించినందుకు గానూ సుమారు రూ.2 కోట్లు వసూలు చేసినట్లు విజిలెన్స్ విభాగం ప్రాథమికంగా తేల్చింది. అప్పటి డిప్యూటీ మేయర్, తన కుమారుడైన భూమన అభినయ్ రెడ్డి పదవిని అడ్డుపెట్టుకొని, మాస్టర్ ప్లాన్ రోడ్ల మార్పుల కోసం అధికారులపై భూమన తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు విచారణలో స్పష్టమైంది.
Also Read : ఏపీ పోలీసులపై మానవ హక్కుల కమిషన్ తీవ్ర ఆగ్రహం..!
ఈ వివాదానికి సంబంధించిన వివరాల ప్రకారం.. గత 2022 జూలైలో తిరుపతి నగరంలో మాస్టర్ ప్లాన్ రోడ్ల అభివృద్ధి కోసం అప్పటి డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ రాధాకృష్ణారెడ్డి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ ప్రణాళికలో భాగంగా వజ్ర అపార్ట్మెంట్, వింటేజ్ హైట్స్ నిర్మాణ అనుమతులకు సంబంధించి 80 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డును ప్రతిపాదించారు. అయితే, ఈ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన తొలి నోటిఫికేషన్ విడుదల కాగానే, సదరు అపార్ట్మెంట్ల యజమానులు నష్టపోకుండా ఉండేందుకు భూమన కరుణాకర్రెడ్డిని ఆశ్రయించారు.
Also Read : జగన్ను ఆదర్శంగా తీసుకున్న కేటీఆర్..!
ఆ సమయంలోనే అలైన్మెంట్లు మార్చడానికి భూమన పెద్ద మొత్తంలో నగదు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ముడుపులు అందిన తర్వాత నిబంధనలను పూర్తిగా పక్కనబెట్టి, నేరుగా వెళ్లాల్సిన రోడ్డును మలుపులుగా మారుస్తూ అధికారులు రెండో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ కొత్త అలైన్మెంట్ కారణంగా 80 అడుగులు ఉండాల్సిన మాస్టర్ ప్లాన్ రోడ్డును కొన్ని చోట్ల 70 నుండి 75 అడుగులకు, మరికొన్ని చోట్ల ఏకంగా 50 అడుగులకు కుదించేశారు. ఈ అక్రమాలపై లోతుగా పరిశీలించిన విజిలెన్స్ విభాగం, ఈ మాస్టర్ ప్లాన్ రోడ్ల ప్రక్రియను పూర్తిగా పునఃసమీక్షించాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. విజిలెన్స్ ఇచ్చిన నివేదిక మరియు సిఫారసుల ఆధారంగా భూమన కరుణాకర్ రెడ్డితో పాటు ఆయన కుమారుడు అభినయ్రెడ్డిపై కఠిన చర్యలు తీసుకునేందుకు మున్సిపల్ అధికారులు సిద్ధమవుతున్నారు.

