గత కొన్ని రోజులుగా తెలంగాణ ప్రభుత్వానికి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాజమాన్యానికి మధ్య తీవ్ర చర్చలకు దారితీసిన రాయదుర్గం భూ వివాదం ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది. ఈ వ్యవహారంలో ఎస్బీఐ కీలక నిర్ణయం తీసుకుంటూ ఒక అడుగు వెనక్కి తగ్గింది. హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను ఉపసంహరించుకోవడానికి బ్యాంక్ ఉన్నతాధికారులు సుముఖత వ్యక్తం చేశారు. రాయదుర్గం నాలెడ్జ్ సిటీలోని వివాదాస్పద 5 ఎకరాల స్థలానికి బదులుగా, ప్రభుత్వం ప్రతిపాదించిన 2.5 ఎకరాల ప్రత్యామ్నాయ భూమిని తీసుకునేందుకు ఎస్బీఐ అంగీకరించింది.
Also Read : కాపులకు జగన్ నమ్మకద్రోహం.. ఇదే సజీవ సాక్ష్యం
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో జరిగిన ఉన్నత స్థాయి చర్చల అనంతరం ఈ సయోధ్య కుదిరినట్లు తెలుస్తోంది. ఈ కొత్త భూమి కేటాయింపులపై తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ అధికారులతో ఎస్బీఐ ప్రతినిధులు త్వరలోనే తుది చర్చలు జరపనున్నారు. ఈ వివాదం కారణంగా ఎస్బీఐపై కఠిన చర్యలు తీసుకునేందుకు, ప్రభుత్వ నిధులను ఇతర బ్యాంకులకు మళ్లించేందుకు తెలంగాణ సర్కార్ గతంలో యోచించింది. అయితే ఎస్బీఐ సానుకూలంగా స్పందించడంతో, బ్యాంక్ తో ప్రభుత్వ లావాదేవీలన్నీ యథాతథంగా కొనసాగనున్నాయి.
Also Read : బరువులు ఎత్తేవాళ్లు ఎక్కువ కాలం బతుకుతారా..?
ప్రభుత్వం తరఫున ఉండే ఫిక్స్ డ్ డిపాజిట్లు, కేంద్రం నుంచి వచ్చే మ్యాచింగ్ గ్రాంట్లు, ఇతర నిధులను ఎస్బీఐలోనే కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. రాష్ట్రంలో ఎస్బీఐకి ఉన్న లీడ్ బ్యాంక్ హోదాను కూడా యథాతథంగా కొనసాగించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ భూ వివాదంపై హైకోర్టులో తదుపరి విచారణ ముగిసిన వెంటనే, ఇరు వర్గాల ఒప్పందానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మరియు ఎస్బీఐ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

