మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ విడుదలకు ముందే నైజాం ప్రాంతంలో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. ప్రభుత్వం ప్రత్యేక జీవో ద్వారా టికెట్ ధరల పెంపుకు అనుమతి ఇచ్చినప్పటికీ, నైజాం ఎగ్జిబిటర్లు మాత్రం పెంచిన రేట్లతో సినిమాను ప్రదర్శించబోమని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం టాలీవుడ్ వర్గాల్లోనే కాకుండా సినీ అభిమానుల్లో కూడా చర్చనీయాంశంగా మారింది.
Also Read : పెద్ది క్లైమాక్స్ లో మెగా విశ్వరూపమే.. ఫ్యాన్స్ కు పూనకాలు..!
నైజాం ఎగ్జిబిటర్ల తరఫున మాట్లాడిన శిరీష్, ప్రస్తుతం అమల్లో ఉన్న సాధారణ టికెట్ ధరలతోనే ‘పెద్ది’ సినిమాను ప్రదర్శిస్తామని వెల్లడించారు. పెంచిన టికెట్ ధరలు ప్రేక్షకులపై అదనపు భారం మోపుతున్నాయని, అందుకే తమ సంఘం ఆ విధానానికి వ్యతిరేకమని తెలిపారు. ప్రభుత్వం జీవో ఇచ్చిందనే కారణంతో ప్రేక్షకులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : ప్రసంగించడానికి వెళ్లి పెట్టుబడులతో వచ్చిన బాబు
ఇదే సమయంలో సింగిల్ స్క్రీన్ థియేటర్ల నిర్వహణ విధానంపైనా ఎగ్జిబిటర్లు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు అమలులో ఉన్న ‘రెంట్’ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి, ఇకపై కేవలం ‘పర్సంటేజీ’ విధానాన్నే అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. థియేటర్లకు న్యాయం జరగాలంటే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఈ మార్పును అంగీకరించాల్సిందేనని ఎగ్జిబిటర్లు చెబుతున్నారు.
జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానున్న ‘పెద్ది’ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే నైజాం ప్రాంతంలో టికెట్ ధరల వివాదం కొనసాగుతుండటంతో, సినిమా ప్రారంభ వసూళ్లపై దీని ప్రభావం పడే అవకాశముందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. భారీ ఓపెనింగ్స్ లక్ష్యంగా పెట్టుకున్న చిత్రబృందానికి ఎగ్జిబిటర్ల ఈ నిర్ణయం ఊహించని షాక్గా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

